భార్య ఆచూకీ కోసం పోలీసులకు 48గంటల డెడ్లైన్.. లేదంటే పిల్లలతోసహా బీఎస్పీనేత సూసైడ్ వార్నింగ్!!
వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన భార్య కోసం పోలీసులకే డెడ్ లైన్ విధించారు. తన భార్యను తీసుకురావాలని, లేదంటే సూసైడ్ చేసుకుంటానని షాక్ ఇచ్చారు. కనిపించకుండా పోయిన తన భార్యను పోలీసులు ఎలాగైనా పట్టుకుని తిరిగి తీసుకురావాలని ఆయన సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ చేశారు.
భార్య మిస్సింగ్ కేసు 48 గంటల్లో తేల్చాలని భర్త పోలీసులకు డెడ్ లైన్
కనిపించకుండాపోయిన తన భార్య ఆచూకీ తెలుసుకోవడం కోసం ఓ వ్యక్తి సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఆ సెల్ఫీ వీడియోలో తన భార్య మిస్సింగ్ కేసును 48 గంటల్లో ఛేదించకపోతే ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుంటానని సంచలనం సృష్టించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు హడావుడిగా ఈ కేసుపై దృష్టిసారించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే
మార్చి నెలలో భార్య మిస్సింగ్.. పోలీస్ స్టేషన్ లో భర్త ఫిర్యాదు, ఆచూకీ కోసం ప్రయత్నాలు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన వ్యాపారి దొరిశెట్టి సత్యమూర్తి భార్య అమ్మపూర్ణ, ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం బిఎస్ పి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ మార్చి ఆరవ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దీనిపై సత్యమూర్తి తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అన్నపూర్ణ ఆచూకీ కోసం సత్యమూర్తి కుటుంబం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఆమెను కనిపెట్టిన లేదా ఆమె గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ. 5 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించింది.
తన కుమార్తెలతో కలిసి సెల్ఫీ వీడియో.. సూసైడ్ చేసుకుంటామని హెచ్చరిక
పోలీసులు తన భార్య మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారే తప్ప, తన కేసును పట్టించుకోవడంలేదని ఆవేదనకు గురైన సత్యమూర్తి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి తన ఇద్దరు కుమార్తె లతో కలిసి సెల్ఫీ వీడియో తీశారు. ఈ సెల్ఫీ వీడియో లో 48 గంటల్లో తన భార్య ఆచూకీ కనుక్కోవాలని, లేదంటే పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుంటానని డెడ్లైన్ విధించారు. తన భార్య లేకుండా తాము బ్రతకలేమని సత్యమూర్తి పేర్కొన్నారు.ఆ తర్వాత ఆ సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుక్రవారం రాత్రి రెండు గంటల నుండి సెల్ ఫోన్ స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి పోలీసుల విజ్ఞప్తి.. శరవేగంగా మిస్సింగ్ కేసు దర్యాప్తు
సత్యమూర్తి సెల్ఫీ వీడియో తో ఉలిక్కిపడ్డ పోలీసులు ఈ కేసు దర్యాప్తు పై దృష్టిసారించారు. సత్యమూర్తి వీడియో వైరల్ కావడంతో డీఎస్పీ శేఖర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి సత్యమూర్తి ఎక్కడున్నా రావాలని, అన్నపూర్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఆమె ఎక్కడ ఉన్న తీసుకువస్తాము అంటూ ప్రకటన చేశారు. అన్నపూర్ణ మిస్సింగ్ కేసుపై యుద్ధ ప్రాతిపదికన పోలీసులు పని చేస్తున్నారు.