‘కరోనా’ పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించొద్దు: విమానాల రద్దు కోసం కేంద్రానికి ఈటెల వినతి
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఆరు పాజిటివ్ కేసులు..
ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని, దీంతో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన పాజటివ్ కేసుల సంఖ్య 6కు చేరిందని చెప్పారు. కరోనాపై పోరులో ఎక్కడా రాజీ పడవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని మంత్రి తెలిపారు.
సెలవులిస్తే.. బాధ్యత లేకుండా ఇలానా?
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకే తాము విద్యా సంస్థలు సెలవులు ప్రకటించామని.. అయితే, కొందరు ఇంట్లో ఉండకుండా ప్రయాణాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు వెళుతున్నారని మండిపడ్డారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలను కరోనాబారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తగ్గే వరకు ప్రజలు ప్రయాణాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనలు లాంటి కార్యక్రమాలను రద్దు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.
వీలైతే అంతర్జాతీయ విమానాల రద్దు..
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు విదేశాల నుంచి వస్తున్న వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అనుమానితులను క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి 20 వేల మందికపైగా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండటంతో.. అందుకు అనుగుణంగా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ క్వారంటైన్లు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉంటాయన్నారు. వికారాబాద్, దూలపల్లిలో క్వారంటైన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని, వాటితోపాటు మరికొన్ని స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలతో ఉన్నవారిని గుర్తించి వారిని 40 ప్రత్యేక బస్సుల ద్వారా క్వారంటైన్ సెంటర్లకు తరలించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి ఈటెల చెప్పారు. అవకాశం ఉంటే హైదరాబాద్(శంషాబాద్ విమానాశ్రయానికి)కు అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేయాలని మంత్రి ఈటెల కోరారు.
నేరుగా కరోనా రాలేదు..
హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కరోనా పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. నిమ్స్, ఫీవర్, ఐపీఎం, ఉస్మానియా ఆస్పత్రుల్లో ల్యాబ్ల ఏర్పాట్లు పూర్తి అయ్యిందన్నారు. మనదేశంలో ఎక్కడా కూడా నేరుగా కరోనా రాలేదని ఐసీఎంఆర్ ఒక నివేదికలో ప్రకటించిందని మంత్రి ఈటెల తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సెలవులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. కరోనా వ్యాపించకుండా తెలంగాణ ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.