తెలంగాణలో భీకర ఎన్కౌంటర్: మావోయిస్టులకు పెద్ద దెబ్బ: ఆరుమంది అక్కడికక్కడే: మృతుల సంఖ్య మరింత
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ అడవులు మళ్లీ భీకర ఎన్కౌంటర్తో దద్దరిల్లిపోయాయి. మావోయిస్టులకు కంచుకోటగా ఉంటున్నట్లు భావిస్తోన్న ఛత్తీస్గఢ్తో సరిహద్దులను పంచుకుంటోన్న తెలంగాణ అటవీ ప్రాంతాలు బుల్లెట్ల శబ్దాలతో మారుమోగాయి. పోలీసులు- మావోయిస్టుల మధ్య ఈ తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది మావోయిస్టులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా కిష్టారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల, ఛత్తీస్గఢ్ వైపు సుక్మా జిల్లాలోని పీసల్పాడ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ మధ్య విస్తరించిన దండకారణ్యంలో మావోయిస్టుల కోసం సుదీర్ఘకాలంగా కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగాలు, గ్రేహౌండ్స్, ఈ రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు కూంబింగ్ నిర్వహిస్తోన్నారు. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టుల కదలికలు ముమ్మరం అయ్యాయి. దీనిపై పక్కా సమాచారం రెండు రాష్ట్రాల పోలీసు అధికారులకు అందింది.
దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశమౌతున్నట్లు నిర్దారణ కావడంతో సీఆర్పీఎఫ్ జవాన్ల సహకారంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. మావోయిస్టులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. దీనికి ప్రతిగా వారు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ దత్ తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుమంది మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు.
సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రి, డంప్ ఉన్నట్లు గుర్తించామని అన్నారు. మావోయిస్టుల వైపు నుంచి సంభవించిన ప్రాణనష్టం మరింత అధికంగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటిదాకా ఆరుమంది మరణించినట్లు అధికారికంగా ఎస్సీ సునీల్ దత్ చెప్పారు. ఈ సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చని తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయి సమాచారం అందాల్సి ఉంది.