హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 800 మంది ఎంపీటీసీలు .. కేసీఆర్ కు ఎంపీటీసీల ఫోరం అల్టిమేటం!!
కేసీఆర్ సర్కార్ పై ఎంపీటీసీలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. గ్రామాలలో వార్డు సభ్యులకు ఉన్న విలువ కూడా ఎంపిటిసిలకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంపీటీసీలు. ఎంపిటిసిలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అందుకే ప్రభుత్వానికి తమ సత్తా తెలిసేలా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎనిమిది వందల మంది ఎంపీటీసీలు ఎన్నికల బరిలోకి దిగుతామని సీఎం కేసీఆర్ పై పోరు సైరన్ మోగించారు.

ఓరుగల్లు వేదికగా పోరు బాట పట్టిన ఎంపీటీసీలు
పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా ఎంపీటీసీల ఫోరం నిర్వహించిన సమావేశంలో, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేం వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంపీటీసీలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేక, ప్రభుత్వ ప్రాధాన్యత ఇవ్వక ఎంపిటిసిలు ఉత్సవ విగ్రహాల్లా మారుతున్నారని మండిపడ్డారు. తమ పరిస్థితిని కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకూ తమ సమస్యల పరిష్కారం జరగలేదన్నారు.

ఎంపీటీసీలకు నిధులు లేవని, కనీస గౌరవం లేదని ఆవేదన
ప్రస్తుతం జరుగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో తమకు కనీస మర్యాద దక్కడం లేదని, నిధులు లేనప్పుడు అసలు ఎంపీటీసీల వ్యవస్థ దేనికని ప్రశ్నిస్తున్నారు. ఎంపిటిసిలకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా కుర్చీలు లేని పరిస్థితులు, అవమానాలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. మరో రెండు మూడు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమావేశం కావడమే కాకుండా రాష్ట్ర కమిటీతో భేటీ అయి కార్యాచరణ ప్రకటిస్తామని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెల్లడించారు.

ఎంపీటీసీలకు అడుగడుగునా అవమానాలు .. అందుకే ఎన్నికల్లో పోటీ
నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఏవీ సాధ్యం కావడం లేదని మండిపడ్డారు. ఎంపిటిసిలకు అడుగడుగునా జరుగుతున్న అవమానాలను దృష్టిలో పెట్టుకొని ఆత్మగౌరవ నినాదంతో హుజురాబాద్ ఎన్నికల బరిలో దిగి తమ సత్తా చాటుతాం అన్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో ఓట్ల కోసమే దళిత బందు పథకాన్ని తీసుకువచ్చారని వేం వాసుదేవ రెడ్డి ఆరోపించారు. దళిత బంధు స్కీం కాదని అదొక పెద్ద స్కామ్ అని ఆరోపించారు.

కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై హుజురాబాద్ ఎన్నికల్లో ప్రశ్నిస్తామన్న ఎంపీటీసీల ఫోరం
సీఎం కేసీఆర్ కు ఏడేళ్ళ నుండి దళితులు ఎందుకు గుర్తు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఓట్ల కోసం పథకం తీసుకు వచ్చామని చెప్పి సీఎం కేసీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు ఆక్రమించారని కేసులు పెట్టిన ప్రభుత్వం ఆయన ఎంత మేరకు ఆక్రమించారో చెప్పలేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు అయిందని విమర్శించారు.హుజురాబాద్ నియోజకవర్గంలో వాడవాడలా తిరిగి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications