హైదరాబాద్ లో 100కోట్ల విలువైన భూకబ్జాకు 90మంది రాయలసీమ రౌడీలు.. అసలేం జరిగిందంటే!!
హైదరాబాద్ లో రాయలసీమ ముఠా హల్ చల్ చేసింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని వంద కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ నేత సోదరుడి నాయకత్వంలో 90 మంది రౌడీలతో రంగంలోకి దిగి భూకబ్జాలకు విఫలయత్నం చేసింది. ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి భూకబ్జాకు యత్నించిన వారిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ లో ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెలర్స్ భూ వివాదం..
ఇంతకీ ఏం జరిగిందంటే హైదరాబాద్లోని షేక్ పేట రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 403 లో 2.5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని 2005లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కు కేటాయించింది. ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ నిర్వాహకులు సుమారు ఎకరంన్నర స్థలంలో నిర్మాణాలు చేసి, మిగతా స్థలాన్ని ఖాళీగా వదిలేశారు. దీంతో అక్రమార్కుల కన్ను ఖాళీ స్థలం పై పడింది. ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కార్యకలాపాల కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఖాళీగా ఉంచిన స్థలానికి కూడా పదిమంది కాపలాదారులను నియమించింది.

వంద కోట్ల విలువైన భూమిని కబ్జా చెయ్యటానికి యత్నం
అయితే ఖాళీ స్థలం తమదేనంటూ కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ స్థల వివాదంపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. పాతబస్తీకి చెందిన వీవీఆర్ శర్మ అనే వ్యక్తి స్థలం తమదేనంటూ కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇక అంతే కాదు శర్మ ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడం కోసం రెండు సంవత్సరాల క్రితం ఏపీకి చెందిన ఎంపీ టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్ కు చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విశ్వ ప్రసాద్ కంపెనీ ప్రతినిధులు పలుమార్లు ఈ స్థలంలో నిర్మాణాలు చేయడానికి ప్రయత్నం చేయగా ఏపీ జెమ్స్ సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకున్నారు.

రాయలసీమ కిరాయి రౌడీలు మారణాయుధాలతో కబ్జాకు యత్నం
ఇక తాజాగా వంద కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించటం కోసం కర్నూలు జిల్లా ఆదోని కి చెందిన కొంతమంది రాజకీయ నాయకులను ఒక గ్రూపుగా కలుపుకొని, రాత్రికి రాత్రే స్థలాన్ని కబ్జా చేయడానికి రంగంలోకి దిగారు. అందుకోసం రాయలసీమ బ్యాచ్ ను మారణాయుధాలతో రంగంలోకి దించిన భూ మాఫియా స్థలాన్ని అ తమ అధీనంలోకి తెచ్చుకోవడం కోసం విధ్వంసం సృష్టించారు. కాపలా దారులపై దాడి చేసి, అక్కడ ఉన్న ఏపీ జెమ్స్ చేసిన నిర్మాణాలను కూల్చివేశారు. ఇక కంటైనర్లను స్థలంలోకి దించి తమ ఆధీనంలోకి స్థలాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒక గంట వ్యవధిలోనే వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు.

62 మంది కిరాయి రౌడీ లను అరెస్ట్ చేసిన పోలీసులు.. స్థలం వద్ద 100మంది పోలీసుల కాపలా
రాయలసీమ గ్యాంగ్ పై ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు సిబ్బందితో కలిసి స్థలం వద్దకు వెళ్లారు. పోలీసుల రాకను గుర్తించిన కొందరు అక్కడినుంచి పారిపోగా, మిగతా 62 మంది కిరాయి రౌడీ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులను రెండు డీసీఎం లలో పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కబ్జా చేయాలని భావించిన స్థలం వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా వందమంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications