పెళ్లికి గంట ముందు టీకా: హైదరాబాద్ మెగా వ్యాక్సినేషన్లో వధువు: పట్టు వస్త్రాల్లో ప్రత్యక్షం
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో- సైబరాబాద్ పోలీసులు చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్.. విజయవంతంగా ముగిసింది. కొన్ని గంటల వ్యవధిలో 40 వేల మందికి పైగా వ్యాక్సిన్లు వేశారు అక్కడి డాక్టర్లు..నర్సులు. ఆదివారం ఉదయం 8 గంటకు ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ రాత్రి వరకూ నిరంతరాయంగా కొనసాగింది. 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికి టీకాలను వేశారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, మెడికవర్ ఆసుపత్రి సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి.
Recommended Video
Kamala Harris తొలి అంతర్జాతీయ పర్యటన: విమానం గాల్లో ఉండగా: దేవుణ్ని ప్రార్థించా
ఈ తరహా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం దేశంలోనే తొలిసారి. ఈ బిగ్ ఈవెంట్ మరొకరికి స్ఫూర్తినిస్తుందని.. వ్యాక్సిన్ వేయించుకోవడానికి పెద్దగా ఇష్టపడని వారిని ఆ దిశగా ప్రోత్సహించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపట్టడానికి తమవంతు సహకారం అందిస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు చెప్పారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం ఇతర ఆసుపత్రులు ముందుకు రావాలని వారు సూచించారు.
ఈ మెగా వ్యాక్సినేషన్ ఈవెంట్లో ఓ నవ వధువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి పీటలు ఎక్కడానికి గంట ముందు.. హైటెక్స్ గ్రౌండ్స్కు చేరుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నారు. ఆ సమయంలో ఆమె పెళ్లి దుస్తుల్లో కనిపించారు. మెడికవర్ నర్సులు ఆ నవ వధువుకు వ్యాక్సిన్ వేశారు. అనంతరం ఆమెతో ఫొటోలు దిగారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత.. పెద్దగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని, టీకా వేయించుకోవడం ఎగ్జయిటింగ్గా అనిపించిందని ఆ వధువు వ్యాఖ్యానించారు.
టీకా వేయించుకోవడానికి తన తల్లిదండ్రులు, వరుడి తరఫు కుటుంబ సభ్యులు అంగీకరించారని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ప్రోత్సహించారని అన్నారు. హైదరాబాద్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించిన వ్యాక్సిన్ డ్రైవ్కు భారీ స్పందన లభించింది. తెల్లవారు జామున 6 గంటల సమయంలో ఆరంభమైన రద్దీ.. రాత్రి వరకూ కొనసాగింది. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫలితంగా మాదాపూర్, కొండాపూర్ మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.