వలసపక్షులతో కాంగ్రెస్ విలవిల .. అయినా ప్రతిపక్ష హోదా కోల్పోవటం అంత ఈజీ కాదు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా ? పోతుందా ? ఇప్పుడు రాజకీయ నాయకుల్లో జరుగుతున్న చర్చ ఇది. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా పోవడం అంత ఈజీ కాదు అన్నది అందరు తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం. ఎందుకంటే దానికి బోలెడన్ని కారణాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంలో భిన్న కోణాలున్నాయి.
టీఆర్ఎస్ బాటలో మరో ఎమ్మెల్యే జాజుల ... కాంగ్రెస్ కు వరుస షాకులా ?
వలసలతో కాంగ్రెస్లో టెన్షన్ .. కొనసాగుతున్న వలసలతో ప్రతిపక్ష హోదాపై చర్చ
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వలసలతో విలవిలలాడుతుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేందుకు క్యూ కడుతుండడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కలవరపడుతున్నారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావుతో మొదలైన ఫిరాయింపులు చిరుమర్తి లింగయ్య, హరి ప్రియా నాయక్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వరకు చేరుకుంది. ఈ లెక్క ప్రకారం ఇంకొక నేత పార్టీ ఫిరాయిస్తే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కదు అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవటం అంత ఈజీ కాదు
అసెంబ్లీలో 19 మంది ఎమ్మెల్యేల బలమున్న కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ బాట పట్టారు. ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతుండడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరింది. ఇంకా ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం ఉంది అన్నది అందరూ భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలు గానీ, పార్టీ మారనున్న ఎమ్మెల్యేలు గానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గానే పరిగణించబడతారు. వారు రాజీనామా చేస్తే గాని, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2/3 ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుని వెళ్లి విలీనం చేస్తే తప్ప ప్రతిపక్ష హోదా కోల్పోవడానికి అవకాశం లేదు. ఈ రెండు పరిణామాలు జరిగితేనే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. మరి అది సాధ్యమా అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, 2/3 ఎమ్మెల్యేలతో విలీనం చేసినా హోదా కోల్పోయే ఛాన్స్
పార్టీ మారిన ప్రతీ ఎమ్మెల్యే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లడం సాధ్యం కాని పని, అలాగని 2/3 ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీకి తీసుకొనివచ్చి విలీనం చెయ్యాలి అన్నా ఒకింత కష్టసాధ్యమే. ఇక అలాంటి పరిస్థితిలో పార్టీ మారినంత మాత్రాన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవడం అంత ఈజీ కాదు అని చెప్పొచ్చు. అసెంబ్లీలో కాం గ్రెస్ ప్రతిపక్ష హోదా కాపాడుకోవాలంటే 12 మంది ఎమ్మెల్యేలు అవసరం. ప్రస్తుతం 12 మంది ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి మరో ఆరు మంది ఎమ్మెల్యేలు టి ఆర్ఎస్ లో చేరి పార్టీని విలీనం చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది.
ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తే కేసీఆర్ అపవాదులు మూటగట్టుకోవాల్సిందే
ఒకవేళ అదే జరిగితే ప్రతిపక్షమే లేని అధికార పార్టీ గా, ప్రశ్నించే వారే లేని నిరంకుశ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ అపవాదును మూటగట్టుకునే ప్రమాదం ఉంది . అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ లీడర్ గా ఒక ఎస్సీ నేతకు అవకాశం ఇచ్చి భట్టి విక్రమార్కను సీఎల్పీ లీడర్ గా ప్రకటించింది. ఒకవేళ ప్రతిపక్ష హోదా రద్దయితే, గతంలో సీఎం కెసిఆర్ దళితుడిని సిఎం చేస్తానని మాట తప్పినట్టే , ప్రతిపక్ష హోదా లేకుండా చేసి మరో దళితులకు అన్యాయం చేశారనే అపవాదును సైతం మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించకుండా కాంగ్రెస్ పార్టీని కుదేలు చేసే వ్యూహమే తప్ప అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే వ్యూహం దాదాపు లేకపోవచ్చు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతుంది.