దారుణం: యువతిని సజీవ దహనం చేశారు
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 25ఏళ్ల యువతిని దుండుగులు సజీవ దహనం చేశారు. ఈ దారుణ ఘటన పంజాగుట్టలోని అగర్వాల్ కంటి ఆస్పత్రి వెనక చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అత్యాచారం చేసి హత్య చేశారా? లేక హత్యా, ఆత్మహత్యా అనే విషయాలు వెల్లడవుతాయని చెప్పారు.
కాగా, యువతి హత్యపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్ అసెంబ్లీలో ప్రస్తావించారు. యువతులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
నగరంలోని అల్వాల్ శ్రీసాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. ప్లాస్టిక్ పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు రూ.20లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
నివాసాల మధ్యలోనే పరిశ్రమ ఉండటం, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో కాలనీవాసులు వూపిరి పీల్చుకున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పరిశ్రమ నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications