దసరారోజు ప్రగతి భవన్ కు పంజరంలో పాలపిట్ట; కేసీఆర్ సెంటిమెంట్ తో కొత్త వివాదం!!
తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా రోజు చేసిన పని ఇప్పుడు ఆయనకు మాత్రమే కాకుండా, అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. సీఎం కేసీఆర్ దసరా రోజు తన సెంటిమెంట్ కోసం అధికారులతో చేయించిన పని ఇప్పుడు వివాదంగా మారింది. దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తే శుభమని తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుండో ఒక ఆచారం ఉంది. ఈ క్రమంలో దసరా రోజు పాలపిట్టను చూడడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పాలపిట్టను ప్రగతి భవన్ కు తెప్పించుకున్నారు. ఇక ఇదే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారింది.
పాలపిట్టని ప్రగతి భవన్ కు తెప్పించుకుని చూసిన కేసీఆర్ ..పక్షుల ప్రేమికుల ఆగ్రహం
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను పంజరంలో బంధించి అధికారులు తీసుకురావడం, సీఎం కేసీఆర్ పంజరంలో బంధించి ఉన్న పాలపిట్టను ప్రగతి భవన్ కు తెప్పించుకుని చూడడం పట్ల జంతు, పక్షుల ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం పాలపిట్టను బంధించడం నేరమని సీఎం కేసీఆర్ చేసిన పని పై చర్చ జరుగుతుంది.
వన్యప్రాణుల సంరక్షణా బోర్డుకు తెలంగాణా చైర్మన్ కేసీఆర్.. చేసిన పనికి షాక్
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రత్యేకంగా వైల్డ్ లైఫ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే సీఎం కేసీఆర్ వైల్డ్ లైఫ్ బోర్డుకు స్వయంగా చైర్మన్ గా ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడి పాలపిట్టని బంధించి తన వద్దకు తెప్పించుకుని చూడడం ఎంత వరకు సమంజసమని జంతు, పక్షుల ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఆయన చర్యకు షాకయ్యామని చెప్తున్నారు.
తెలంగాణా రాష్ట్ర పక్షిని బంధించి ఏం సందేశం ఇస్తున్నారు కేసీఆర్
వన్య ప్రాణుల సంరక్షణ చట్టానికి చైర్మన్ గా ఉండి, వన్యప్రాణులు విషయంలో ఈ తరహా ప్రవర్తన దేనికి నిదర్శనమో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పక్షిని పంజరంలో బంధించి కెసిఆర్, తన కుటుంబంతో పాటు చూడటం వన్యప్రాణుల సంరక్షణ విషయంలో ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారో చెప్పాలని వన్యప్రాణుల ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.