కిలాడీ లేడీ: ఉద్యోగాలు ఇప్పిస్తానని 30లక్షల టోకరా
హైదరాబాద్: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు నిరుద్యోగులను ఓ మహిళ నమ్మించింది. అంతేగాక, వారి వద్ద రూ.30లక్షల వరకూ వసూలు చేసింది. డూప్లికేట్ ఆర్డర్లు, నకిలీ ఇంటర్వ్యూ పత్రాలు వారి చేతుల్లో పెట్టింది. కాగా, ఆమె మోసాన్ని గుర్తించిన ఓ బాధితుడి ఫిర్యాదుతో చివరకు పోలీసులకు చిక్కింది.
వివరాల్లోకి వెళితే.. లాల్బజార్ మహాంకాళి ఆలయం పక్కన ఉంటున్న మీరాబాయి(45) రైల్వేలో అటెండర్ ఉద్యోగం చేస్తున్నానని పలువురు నిరుద్యోగ యువకులను నమ్మించింది. అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపు 29 మంది నిరుద్యోగుల వద్ద రూ.30 లక్షల వరకు వసూలు చేసింది.
వారికి ఇంటర్వ్యూలు జరిగినట్లు నమ్మించి, బోగస్ అపాయింట్మెంట్ సర్టిఫికెట్లపై డైరెక్టర్ డూబ్లికేట్ సంతకంతో కూడిన పత్రాలను అందజేసింది. సదరు బాధితుల్లో ఒకరు మౌలాలి గాయత్రినగర్కు చెందిన మహేశ్ రూ.లక్షా 5లు ఇచ్చానని తిరుమలగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
అతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మీరాబాయిని విచారించగా తాను చేసిన తప్పును అంగీకరించిందని తిరుమలగిరి ఎస్సై శ్రీనునాయక్ తెలిపారు. నిరుద్యోగుల వద్ద సేకరించిన డబ్బును ముషీరాబాద్కు చెందిన అబ్దుల్ రహమాన్ అలియాస్ అక్రమ్కు ఇచ్చానని చెప్పిందని ఎస్సై తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యం
ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. డివిజన్లోని నెహ్రునగర్కు చెందిన కె. నాగరాజు (34) బేగంపేట ఏయిర్పోర్టులో అటెండర్గా పనిచేస్తున్నాడు. నవంబర్ 2న విధులకు వెళ్లిన నాగరాజు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో సైఫాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగరాజు వివరాలు తెలిస్తే సైఫాబాద్ పీఎస్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.