ఈ మనుషుల మధ్య ఉండలేను: ప్రేమ విఫలమై యువతి.. ప్రియురాలి మృతితో యువకుడు
హైదరాబాద్: నగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. తన ప్రేమ విఫలమై ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా.. తన ప్రియురాలు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు మరో యువకుడు. ఈ రెండు ఘటనలు వారి వారి కుటుంబాల్లో తీరని విషాన్ని నింపాయి.
మొదటి ఘటనకు సంబంధించి పేట్బషీరాబాద్ ఎస్సై గంగాధర్ వివరాల ప్రకారం... దత్తాత్రేయనగర్లో నివసిస్తున్న ఎనుగుల కృష్ణ(27) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.

ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక..
కాగా, ఆ యువతి రెండు నెలల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ప్రేమించిన యువతి దూరం కావడంతో కొన్నిరోజులుగా ఆ బాధను దిగమింగలేకపోతున్నాడు కృష్ణ. శనివారం రాత్రి ఇంట్లో భోజనం చేసి సమీపంలోని మరో గదిలో నిద్రించటానికి వెళ్లాడు. కొద్ది సేపటికే అతని అన్న రవి కూడ అక్కడికి వెళ్లాడు. సోదరుడు ఎంత పిలిచినా గది తలుపులు తీయకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలుగొట్టి చూడగా ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని విగతజీవిగా కన్పించాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎంటెక్ చేస్తున్న చైతన్య
రెండో ఘటనకు సంబంధించి జీడిమెట్ల సీఐ శంకర్రెడ్డి, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. చెరుకుపల్లి కాలనీకి చెందిన జయలక్ష్మి, ప్రభాకర్ దంపతులకు ఒక కుమారుడు విన్ని, ముగ్గురు కుమార్తెలు వంశీ, చైతన్య(24), హర్ష. ప్రభాకర్ 20ఏళ్ల క్రితమే చనిపోవడంతో జయలక్ష్మి ఉద్యోగం చేస్తూ నలుగురు పిల్లలను చదివించింది. నాలుగేళ్ల క్రితం వంశీకి వివాహం జరిపించింది. హర్ష, విన్ని ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండగా చైతన్య వెల్లూర్లోని విట్లో ఎంటెక్ చదువుతోంది.

కిశోర్తో ప్రేమలో..
కాగా, రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి గాగిల్లాపూర్లోని స్నైడర్ పరిశ్రమలో ప్రాజెక్టు వర్క్ చేస్తోంది. రెండేళ్లుగా వెల్లూర్ సమీపంలోని అంబూర్కు చెందిన కిశోర్, చైతన్య ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా దూరం పెరిగిపోవడంతో చైతన్య మానసికంగా కుంగిపోయింది. కుటుంబసభ్యుల వద్ద చెప్పుకుని వాపోయింది. దీనికితోడు చెరుకుపల్లి కాలనీలోని తమ ఇంటి స్థలంలో సగ భాగాన్ని స్థానిక సంక్షేమ సంఘం నేత కబ్జా చేసిన వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ఈ వ్యవహారాన్ని కూడా చైతన్యే చూసుకుంటోంది. కుటుంబంలో ముగ్గురు పనిచేస్తున్నా అవసరాలు తీరడం లేదనీ మనోవేదనకు గురవుతోంది.

దయాదాక్షిణ్యాలు లేని మనుషుల మధ్య ఉండలేను
గత ఆదివారం రాత్రి కుటుంబసభ్యులంతా రెండో ఆట సినిమాకి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి వచ్చి చూసేసరికి చైతన్య ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా, ‘దయాదాక్షిణ్యాలు లేని మనుషుల మధ్య ఉండలేనని, నమ్మిన ప్రియుడు మోసం చేశాడని... తల్లిని సంతోష పెట్టాలనే కోరిక తీరనందుకు బాధపడుతున్నానని.. తల్లిని బాగా చూసుకోవాలి' అని చైతన్య తన సూసైడ్ నోట్లో పేర్కొంది. ఆమె ఆత్మహత్యకు కారణమైన కిశోర్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications