పెళ్లైన విషయం దాచి మరో యువతితో వివాహం: ఆమె సోదరిపై కన్నేసి..
హైదరాబాద్: ఓ వ్యక్తి మోసానికి ఓ అమాయక వివాహిత బలికావాల్సి వచ్చింది. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తనకు పెళ్లయిన విషయం దాచి పెట్టిన ఓ యువకుడు మరో యువతిని ప్రేమించి పెళ్లాడాడు. ఆమె సోదరిపైనా కన్నేసి ఆమెను వివాహమాడేందుకు సిద్ధమయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన రెండో భార్య ఆత్మహత్య చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కంచన్బాగ్ డివిజన్ గులాం ముస్తఫానగర్కు చెందిన ఇక్రాం రుక్ముద్దీన్(28) ఏ పనీ చేయకుండా తిరుగుతుంటాడు. మొదట అజియా బేగంను పెళ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. సంవత్సరం క్రితం నూరున్నీసా(23) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదు నెలల పాప ఉంది.
అవివాహితురాలైన నూరున్నిసా సోదరిపైనా రుక్ముద్దీన్ కన్ను పడింది. ఆమెను వివాహం చేసుకుంటానని పలుమార్లు భార్యను మానసికంగా వేధించాడు. గర్భవతిగా ఉన్నప్పుడు సైతం అనేక చిత్రహింసలకు పూనుకున్నాడు.
ఆ తర్వాత ఆమె బిడ్డను మొదటి భార్యకు ఇచ్చేస్తానంటూ లాక్కుని ఆమెను ఆమె పుట్టింట్లో వదిలి వెళ్లాడు. దీంతో మనోవేదనకు గురైన నూరున్నీసా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆమె మార్గమధ్యలోనే మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.