ఇండియన్ రైల్వేలో సంచలన రికార్డ్ నెలకొల్పిన 'కృష్ణా ఎక్స్ ప్రెస్'
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు నడుస్తున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ గురించి తెలియని తెలుగువారుండరు. ఎప్పుడు రైలు ఎక్కితే ఎప్పుడు గమ్యస్థానానికి చేరతామో అంతా దేవుడి దయ. భగవంతుడి మీద భారం వేసి రైలు ఎక్కడమే. దానికి ఇష్టమైన సమయానికి తీసుకువస్తుంది. ఇంతవరకు ఈ రైలు షెడ్యూల్ ను సమయ పాలన ప్రకారం నడపాలనే ఆలోచనే అధికారులకు కలగలేదు. కృష్ణా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే ప్రయాణికులంటే వారికి అంత చులకన అయిపోయింది.
సికింద్రాబాద్ నుంచి విజయవాడకు
సరిగ్గా 1974 అక్టోబరు రెండోతేదీన కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభమైంది. డీజిల్ ఇంజన్ తో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు నడిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నది వారధిగా ఉండటంతో ఈ రైలుకు కృష్ణా ఎక్స్ ప్రెస్ అని నామకరణం చేశారు. ఈ రైలు ప్రారంభమైన సమయంలో ఉదయం వేళ నడిచే ఎక్స్ ప్రెస్ రైలుగా పేరు తెచ్చుకుంది. క్రమంగా ఈ రైలును విజయవాడ నుంచి గుంటూరు వరకు పొడిగించారు. తర్వాత తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట.. ఇలా తిరుపతి వరకు నడుపుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా ఆదిలాబాద్ వరకు పొడిగించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు నడుస్తోంది. 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 17405, 17406 నెంబర్ల కృష్ణా ఎక్స్ ప్రెస్ తో తమకున్న అనుబంధాన్ని ప్రయాణికులు గుర్తుచేసుకున్నారు.

సూపర్ ఫాస్ట్ గా నడపాలంటున్నారు
సరస్వతీదేవి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రైలునే ఆశ్రయించేవారు. అలాగే తెలంగాణ ప్రాంత ప్రజలు తిరుమలలో కొలువైన శ్రీనివాసుడిని దర్శించుకోవాలనే ఈ రైలే ఆధారంగా ఉండేది. కాలక్రమంలో అనేక రైళ్లు పట్టాలెక్కాయి. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు చాలా తక్కువ బడ్జెట్ తో ప్రయాణానికి వీలుగా ఉండే ఈరైలు ఎక్కువగా పగటివేళే నడుస్తుంది. అదొక్కటే దీనికి మైనస్. ఈ రైలును సూపర్ ఫాస్ట్ గా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications