ఐదేళ్లు సహజీవనం చేసి, కాదుపొమ్మన్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష
అతడు సాధు వెంకట ప్రవీణ్ కుమార్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామస్తులు. ఒకే ఊరికి చెందిన వీరిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు.
ఖమ్మం: వారిద్దరూ బాల్యంలో స్నేహితులు. యవ్వనంలో ప్రేమికులు. ఇప్పుడు.. అతడొక మోసగాడు. ఆమె ఒక దీనురాలు. ఆమె తెలిపిన ప్రకారం, అసలేం జరిగిందంటే...ఆమె గోళ్లమూడి వెంకటరమణ. అతడు సాధు వెంకట ప్రవీణ్ కుమార్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామస్తులు. ఒకే ఊరికి చెందిన వీరిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు.
వీరి బాల్య స్నేహం.. యవ్వనంలో ప్రేమగా మారింది. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లారు. అతడు ఎం.ఫార్మసీలో, ఆమె ఎంటెక్ లో చేరారు. పెళ్లి చేసుకుంటాము కాబట్టి, అప్పటిదాకా సహజీవనం చేద్దామన్నాడు. ఆమె నమ్మింది. సరేనంది. ఇద్దరూ కలిసి ఐదేళ్లపాటు ఒకే గదిలో సహజీవనం చేశారు. ఆమెకు ఇప్పటికి మూడుసార్లు అబార్షన్ చేయించాడు. హైదరాబాదులోని ప్రయివేటు కంపెనీలో అతడు పనిచేస్తున్నాడు.
ఆరు నెలల కిందట హైదరాబాదులోని ఇంజనీరింగ్ కళాశాలలో ఆమె ఫ్యాకల్టీగా చేరింది. అప్పటి నుంచి కళాశాల హాస్టల్ లో ఉండాల్సి వచ్చింది. అప్పటి నుంచి అతడు ఆమెకు దూరం దూరంగా ఉంటున్నాడు. పెళ్లికి మొహం చాటేస్తున్నాడు. ఫోన్ చేసినా స్పందించడం లేదు.
గ్రామ పెద్దలను ఆమె ఆశ్రయించింది. తామిద్దరం కలిసి దిగిన ఫొటోలను చూపించింది. వారు అతడికి చెప్పి చూశారు. పెళ్లి చేసుకునేది లేదన్నాడు. ఆమె అతడి ఇంటికి నేరుగా అడిగింది. ఆమెకు కూడా అదే విషయం చెప్పాడు. దీంతో ఆమె, న్యాయం కోసం తన ప్రియుడి ఇంటి ముందు బుధవారం మౌన పోరాటానికి దిగింది.