సికింద్రాబాద్ స్టేషన్ లో భయానకం - పోలీసుల గాల్లోకి కాల్పులు : కొనసాగుతున్న టెన్షన్..!!
అగ్నిపథ్ పై ఆగని నిరసనల హోరుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసన కారులు భారీగా స్టేషన్ లోకి చేరుకొని రైళ్లకు నిప్పు పెట్టారు. యధేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. పెద్ద సంఖ్యలో వచ్చిన నిరసనకారులను కంట్రోల్ చేయటం పోలీసులకు కష్టంగా మారింది. రెండు గంటల పాటు రైళ్లకు నిప్పు పెట్టటం.. విధ్వసం చేయటంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. అయితే, పోలీసుల పైన పెద్ద సంఖ్యలో ఉన్న ఆందోళన కారులు రాళ్లతో దాడి చేసారు. వారిని నియంత్రించటం కష్టంగా మారటంతో..రాళ్ల దాడికి పాల్పడుతుడటంతో గాల్లోకి కాల్పులు జరిపారు.
నాలుగు గంటల విధ్వంసం
రబ్బరు బుల్లెట్లు వినియోగించినట్లుగా తెలుస్తోంది. కొందరు ఆందళన కారులు గాయపడటంతో పోలీసులు ఫైర్ ఓపెన్ చేసారంటూ నిరసనకారులు నినిదాలు చేస్తున్నారు. ఒకటో నెంబర్, 9 , 10 వ నెంబర్ ప్లాట్ ఫాం పైన నిలిచి ఉన్న రైళ్లకు నిప్పు పెట్టారు. దీంతో దాదాపు గా పది బోగాలు కాలిపోయినట్లుగా తెలుస్తోంది. స్టేషన్ లో ఉన్న అజంతా ఎక్స్ ప్రెస్ లో నాలుగు కంపార్ట్ మెంట్లు దహనమయ్యాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. గాయపడిన పోలీసు సిబ్బంది.. నిరసనకారులను దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.
రబ్బరు బుల్లెట్ల ప్రయోగించారంటూ
డీజిల్ ట్యాంకు పైనా నిరసన కారులు దాడి చేసారు. అవి పేలితే భారీగా నష్టం తప్పదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాము నాలుగేళ్లుగా ఆర్మీలో చేరేందుకు అనేక రకాలుగా పరీక్షలకు సిద్దం అవుతున్న సమయంలో.. కేంద్రం తీసుకొచ్చిన ఈ నిర్ణయం ద్వారా తాత్కాలిక ఉద్యోగంగా మార్చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల్లో కొందరు నిరసన కారులు ప్లాట్ ఫాం పైన పడిపోయి కనిపిస్తున్నారు. ఆర్పీఎఫ్ . .రైల్వే పోలీసు అధికారులు - సిబ్బంది కి వారిని నియంత్రించటం కష్టంగా మారింది. తమకు పరీక్షల తేదీలు ప్రకటించే వరకూ స్టేషన్ వదిలి వెళ్లమని చెబుతున్నారు. ఫైరింగ్ శబ్దాలు స్టేషన్ ప్రాంగణంలో వినిపిస్తున్నాయి.
పోలీసుల పై రాళ్ల దాడి..
ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో మరింతగా రెచ్చిపోయిన ఆందోళన కారులు పోలీసుల పైన రాళ్ల దాడి కొనసాగిస్తున్నారు. స్టేషన్ లో కొనసాగుతున్న ఆందోళనతో సాధారణ ప్రయాణీకుల పరిస్థితి దయనీయంగా మారింది. సికింద్రాబాద్ కు రావాల్సిన రైళ్లను సమీప స్టేషన్లలో నిలిపివేసారు. అదే విధంగా స్టేషన్ నుంచి బయల్దేరాల్సిన రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసారు. దహనం అవుతున్న బోగీల్లో మంటలు మాత్రం పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి. అయితే, రైల్వే ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ఇంకా పెద్ద సంఖ్యలో ఆందోళన కారులు రైలు పట్టాలపైన కూర్చొని కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications