టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఛాయిస్ ఆ ఇద్దరు..!?
తెలంగాణలో కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ అయిదు రోజుల ఢిల్లీ టూర్ పూర్తయింది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు..నామినేటెడ్ పదవుల భర్తీ పైన పార్టీ నాయకత్వంతో రేవంత్ చర్చలు చేసారు. పలువురు కేంద్ర మంత్రులను రాష్ట్ర సమస్యల పైన కలిసారు. ప్రధానంగా టీపీసీసీ చీఫ్ విషయంలో రేవంత్ ఇద్దరి పేర్లను సిఫార్సు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
టీపీసీసీ నూతన చీఫ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడి ఎంపికపై రెండు రోజులుగా ఢిల్లీలో కొనసాగుతున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఒకటి రెండు రోజులలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ప్రస్తుత పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి కీలక సూచనలు చేసారు. సామాజిక వర్గాల సమీకరణాలే ముఖ్యమని చెప్పారు. ఎవరికి పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించినా..కలిసి పని చేస్తామని స్పష్టం చేసారు.

ఏఐసీసీ కసరత్తు
పార్టీ అగ్రనాయకత్వం టీపీసీసీ ఎంపిక పై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో మొదట చర్చించిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. ఆ తర్వాత మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితర ముఖ్య నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకున్న ఆమె పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు నివేదించినట్టు తెలిసింది.

రేవంత్ ఛాయిస్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ లేక మహబూబాబాద్ ఎంపీ బల్రాం నాయక్ పేర్లను రేవంత్రెడ్డి ప్రతిపాదించినట్టు సమాచారం. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అనుసరించాల్సిన సామాజిక సమీకరణలపై సీఎం తన వాదనను అధిష్ఠానానికి వినిపించగా, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో చర్చించిన అనంతరం రెండు, మూడు రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నట్టు కేసీ తెలిపినట్టు సమాచారం. నూతన పీసీసీ చీఫ్ తో పాటుగా మంత్రివర్గం పైన హైకమాండ్ తీసుకొనే నిర్ణయం పై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications