టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే?
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున రాజ్యసభకు పోటీచేసేవారి పేర్లను అనధికారికంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని పార్టీవర్గాలు వెల్లడించాయి. మొత్తం మూడు స్థానాలకుగాను ఒకటి ప్రకాష్ రాజ్కు, మరో సీటు పొంగులేటి సుధాకర్రెడ్డి, మరొకటి కల్వకుంట్ల కవితకు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే మూడోసీటుకు కవితతోపాటు బోయినపల్లి వినోద్కుమార్, మోత్కుపల్లి నరసింహులు, మహబూబాబాద్ మాజీ ఎంపీసీతారాంనాయక్ పోటీపడుతున్నారు.

ప్రకాష్ రాజ్కు తథ్యం!
జాతీయస్థాయిలో కేంద్రంపై యుద్ధభేరి మోగించిన కేసీఆర్ అందుకు తగ్గట్లుగా రాజ్యసభ సభ్యులను ఎంపిక చేస్తారని, చేశారని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఢిల్లీతోపాటు జాతీయంగా తెలంగాణ తరఫున తమ బాణి వినిపించేందుకు ప్రకాష్రాజ్ను ఎంపిక చేయడమే సరైనదిగా కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి ఆయనతో మంతనాలు చేస్తున్నారు. ఈ మంతనాల్లో ప్రకాష్ రాజ్తోపాటు ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొంటున్నారు. వీరందరి ధ్యేయం రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే. అంతేకాకుండా తెలంగాణలో ఒక గ్రామాన్ని ప్రకాష్ రాజ్ దత్తత కూడా తీసుకున్నారు. అది కూడా ఆయనకు కలిసివస్తోంది.

పొంగులేటి నిరాకరణ
మరొక సీటు తీసుకోవడానికి పొంగులేటి సుధాకర్రెడ్డి నిరాకరిస్తున్నారు. ఆ సీటు పదవీకాలం రెండు సంవత్సరాలకన్నా తక్కువే ఉండటంతో ఆయన ఆసక్తిగా లేరు. ఎంపీగా ఉన్న బండ్ల ప్రకాశ్ రాజీనామా చేయడంతో ఈ సీటుకు ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు సుధాకర్రెడ్డిని బుజ్జగిస్తున్నాయి.

జాతీయస్థాయిలో చాణక్యం తెలిసివుండాలి
మిగిలిన మూడోసీటుకు తీవ్రస్థాయిలో పోటీ ఉంది. జాతీయస్థాయిలో రాజకీయాల్లో చాణక్యం నెరిపేందుకు బోయినపల్లి వినోద్కుమార్నుకానీ, కల్వకుంట్ల కవితను కానీ ఎంపిక చేస్తారంటున్నారు. వీరితోపాటు ఎస్సీ ఖాతాలో మోత్కుపల్లి నరసింహులకు, ఎస్టీ ఖాతాలో సీతారాంనాయక్కు కూడా న్యాయం చేస్తానని కేసీఆర్ గతంలోనే మాటిచ్చివున్నారు. ఇచ్చిన మాట ప్రకారం వీరికి న్యాయం చేస్తారా? ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని అందుకు తగ్గవారిని ఎంపిక చేస్తారా? అనే విషయంలో స్పష్టత లేదు.

సంబంధాలు బాగుంటే జూపల్లి వెళ్లేవారు?
మైహోం జూపల్లి రామేశ్వరరావుతో సంబంధాలు బాగుండివుంటే రాజ్యసభకు ఆయన్ను ఎంపిక చేసివుండేవారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చినజీయరుస్వామితోపాటు జూపల్లితో కూడా స్నేహం చెడిపోవడంతో ఆయనకు ఇప్పుడు అవకాశం లేకుండా పోయిందంటున్నారు. ఏదేమైనా కానీ రాజ్యసభ సభ్యుల ఎంపిక మాత్రం జాతీయస్థాయి రాజకీయాలకు అనువైనవారినే తీసుకుంటారని అంచనా. రెండురోజుల్లో వీరిపేర్లపై ఒక స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications