అమరావతి ఉద్యమంలో కీలక మలుపు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఇదేరోజున మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
ముఖ్యమంత్రి ప్రకటనతో రాజధాని ప్రాంత పరిధిలోని 29 గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతిరోజు అన్ని గ్రామాల్లో అన్నదాతలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. వివిధ పద్దతులద్వారా తమ ఆందోళనను తెలియజేస్తున్నారు. అధికార వైసీపీ మినహా ఇతర పార్టీలన్నీ అమరావతి రైతులకు మద్దతు ప్రకటించాయి. వారికి అనుకూలంగా రాజధాని గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించాయి.

న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేసిన ఉద్యమం ప్రధానమైంది. ఆ తర్వాత అరసవెల్లి వరకు మరో పాదయాత్ర నిర్వహిస్తుండగా తూర్పు గోదావరి జిల్లాలో అర్థాంతరంగా ఆగిపోయింది. ఢిల్లీలో కూడా రైతులు తమ ఆందోళనలను వ్యక్తపరిచారు. ఒకవైపు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ మరోవైపు కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సీఆర్డీయే చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ చెల్లవని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆలోపే వైఎస్ జగన్ సర్కార్ ఆ బిల్లులను ఉపసంహరించుకుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాజధానిలో ఆర్-5 జోన్ అంశాన్ని అమరావతి రైతులు సవాల్ చేశారు. అమరావతి నుంచి విశాఖపట్నానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని తరలిస్తున్నామని చెబుతూ ఆ ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారంటూ రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications