షాకింగ్: బీజేపీతో టీఆర్ఎస్ సంధి? -హైదరాబాద్కు కేసీఆర్, ఢిల్లీకి బండి సంజయ్ -ఏం జరుగుతోంది?
దేశరాధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీపై గ్రేట్ ఫైట్ ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఫలితాల అనంతరం కేంద్రంపై ప్రశంసల ప్రకటలు చేసి, మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీ లాంటి పెద్దలను కలిశారు. పలు కీలక, వివాదాస్పద అంశాల నేపథ్యంలో బీజేపీతో టీఆర్ఎస్ సంధికుదుర్చుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన కొద్దిసేపటికే.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో బండి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు.
Recommended Video
KCR 2.0:భారీగా పుంజుకున్న బీజేపీ -సంక్షేమాభివృద్ధిలో టాప్, అయినా ఎదురుదెబ్బలు -ఎన్నికల భయం
ఢిల్లీలో కేసీఆర్ పరపతి
గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీపై పోరాటాన్ని ఉధృతం చేస్తానన్న సీఎం కేసీఆర్... చెప్పినట్లుగానే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్ కు సంపూర్ణ సహకారం ప్రకటించి, తెలంగాణలో బంద్ ను విజయవంతం చేశారు. తర్వాతి స్టెప్ ఏమిటనే చర్చ జరుగుతుండగానే, సడెన్ గా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అంశంలో కేంద్రానికి కితాబిస్తూ కేసీఆర్ లేఖ రాయడం, ఆ తర్వాత ఢిల్లీకి పయనం కావడం తెలిసిందే. పవన్ కల్యాణ్ లాంటి మిత్రులకే అపాయింట్మెంట్లు ఇవ్వని కేంద్ర పెద్దలు, వ్యతిరేకుల పట్ల ఎంత నిర్దయగా వ్యవహరిస్తారో విదితమే. అలాంటిది కేసీఆర్ అలా వెళ్లగానే.. ఇలా కేంద్ర పెద్దల అపాయింట్మెంట్లు ఇవ్వడం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా దాదాపు కీలక మంత్రులందరినీ కేసీఆర్ కలవడంతో ఢిల్లీలో ఏం జరుగుతోందన్న ఆసక్తి పెరిగిపోయింది. అయితే..
అందుకే వెళ్లారని చెబుతున్నా..
చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, తక్షణ వరద సాయం కింద రూ.1350 కోట్లు, పెండింగ్లో ఉన్న జీఎస్టీ బకాయిలు విడుదల, సాగునీటి ప్రాజెక్టులకు సాయం, నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన రూ.24 వేల కోట్లు విడుదల తదితర అంశాలపై మాట్లాడేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని అధికారికంగా ప్రభుత్వం చెబుతుండగా, రాజకీయ వర్గాల్లో మాత్రం భిన్నమైన చర్చ జరుగుతోంది. కేసీఆర్, టీఆర్ఎస్ ఇతర నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనడానికి ఆధారాలున్నాయని, వాటిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బాహాటంగా చెబుతున్నారు.
కేంద్రం వద్ద కీలక ఆధారాలు?
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థుల ఖాతాల్లోకి ఒక కాంట్రాక్టర్ నుంచి కోటి రూపాయల వంతున నేరుగా జమ చేయించారన్న విషయం కేంద్ర ఏజెన్సీలు పసిగట్టాయని, బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్కు కేసీఆర్ ఆర్థికసాయం చేశారన్న సమాచారాన్ని కూడా కేంద్రం సేకరించిందని, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి పాతకేసుపై సీబీఐ దర్యాప్తుకు రంగం సిద్ధమవుతోందని, వీటన్నింటి నేపథ్యంలో కాంప్రమైజ్ కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాల్లో కొద్ది గంటలుగా పుకార్లు వస్తున్నాయి. కేసీఆర్ వ్యతిరేక గ్రూపుల్లోనైతే గ్రేటర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లను టీఆర్ఎస్ బీజేపీతో పంచుకోబోతోందనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి ఇవి నిరాధారమైన ఆరోపణలే అయినా, సరిగ్గా..
బండికి హైకమాండ్ పిలుపు..
గులాబీ-కమల దళాలు కాంప్రమైజ్ కాబోతున్నాయన్న పుకార్ల మధ్యే, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. సరిగ్గా ఆయన విమానం ఎక్కే సమయానికే.. బీజేపీ హైకమాండ్ నుంచి తెలంగాణ పార్టీ చీఫ్ బండి సంజయ్ కు పిలుపు వచ్చింది. వెంటనే ఢిల్లీ వచ్చి కలవాలని ఆదేశించడంతో బండి హుటాహుటిన ఆదివారం హస్తినకు పయనమయ్యారు. గ్రేటర్ ఫలితాల తర్వాత ఓసారి ఢిల్లీకి వెళ్లొచ్చిన సంజయ్ ని.. కేసీఆర్ పర్యటన ముగిసిన మరుక్షణంలోనే మళ్లీ ఢిల్లీ బాట పట్టడం ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ ఫెడరల్ పోరు ముగిసినట్లేనా?
సీఎం కేసీఆర్ కేంద్రం ముందుంచిన ప్రతిపాదనలపై మాట్లాడేందుకే సంజయ్ ను ఢిల్లీ రమ్మని పిలిచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈదఫా పర్యటనలో సంజయ్.. ప్రధాని మోదీని కూడా కలుస్తారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాలను కూడా కలుస్తారని తెలుస్తోంది. కేంద్ర పెద్దలను కేసీఆర్ కలిసిన కొద్ది గంటలకే బండి సంజయ్ ఢిల్లీ పర్యటన జరుపుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ద్వారా బీజేపీతో పోరాడుతానన్న కేసీఆర్ ఆ దిశగా కార్యాచారణ ప్రకటించలేదు. రైతుల నిరసలకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్.. తన ఢిల్లీ పర్యటనలో రైతు సంఘాల నేతలు ఒక్కరిని కూడా కలవకుండానే వెనుదిరిగారు. టీఆర్ఎస్ పట్ల కేంద్రం అప్రోచ్ మారిందనే చర్చ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతున్నది.
కరోనా: ఏక్షణమైనా వ్యాక్సిన్ పంపిణీ -నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు -దేశంలో కొత్తగా 30,245 కేసులు