వికాస్ పర్వ్: బీజేపీలో ఉత్తేజం, టీఆర్ఎస్ కుటుంబ పాలనపై షా నిప్పులు (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, టీఆర్ఎస్ కుటుంబ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీని, ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని ఆయన కోరారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా చేపట్టిన 'వికాస్ పర్వ్'లో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం బీజేపీ నిర్వహించిన వికాస్ పర్వ్ బహిరంగ సభలో అమిత్ పాల్గొని ప్రసంగించారు.
కేంద్రంలో, రాష్ట్రాల్లో ఎక్కడ కుటుంబ పాలన ఉన్నా అక్కడ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ''గత రెండేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.90 వేల కోట్లకుపైగా నిధులను విడుదల చేసింది. రూ.90 వేల కోట్లకు సంబంధించిన ప్రతి పైసాకు నా దగ్గర లెక్క ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులు పల్లెలకు చేరడంలేదు'' అని షా ఆరోపించారు.
టీఆర్ఎస్ కుటుంబ పాలనపై అమిత్ షా నిప్పులు
బీజేపీతోనే అభివృద్ధి తెలంగాణ సాధ్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్ కావాలని ఆశిస్తున్నానని, తెలంగాణ సమగ్రాభివృద్ధి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో తప్ప మరెవ్వరితోనూ సాధ్యం కాదని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైందని అమిత్ షా చెప్పారు.
టీఆర్ఎస్ కుటుంబ పాలనపై అమిత్ షా నిప్పులు
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ధ్వజమెత్తారు. రెండేళ్ళలో ఏమి చేశారంటూ సోనియా గాంధీ ప్రశ్నించినట్లు తాను టివీలో చూశానని పేర్కొన్న ఆయన రెండేళ్ళలో ఏమి చేశామో చెప్పేందుకు, ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కానీ ‘మీరు 60 ఏళ్ళలో ఏమి చేశారో ప్రజల ముందు పెట్టగలరా?' అని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్ కుటుంబ పాలనపై అమిత్ షా నిప్పులు
తాము ప్రజలతో మాట్లాడే, మమేకమయ్యే ప్రధానిని ఇచ్చామని, మీ (యుపిఎ) హయాంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కేవలం మీకు (సోనియా), రాహుల్ గాంధీకే పరిమితమయ్యేవారని అంటూ మన్మోహన్ను ‘మౌని బాబా'గా ఆయన విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ళలో ఒక్క కుంభకోణం జరగలేదని ఆయన చెప్పారు.
టీఆర్ఎస్ కుటుంబ పాలనపై అమిత్ షా నిప్పులు
ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన రాహుల్ బాబాగా అభివర్ణించారు. దేశ సరిహద్దుల్లో యుపిఎ హయాంలో కాల్పులు జరిగేవని ఇప్పుడూ జరుగుతున్నాయని రాహుల్ అన్నారని ఆయన చెబుతూ రాహుల్ బాబా ఇటాలియన్ కళ్ళ జోడు పెట్టుకున్నందున వాస్తవాలు కనిపించడం లేదని విమర్శించారు.
టీఆర్ఎస్ కుటుంబ పాలనపై అమిత్ షా నిప్పులు
పాక్ తుపాకులతో కాల్పులు జరిపితే తమ సైన్యం ఫిరంగి గుళ్లతో సమాధానం చెబుతోందన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అక్షరజ్ఞానం, సంస్కృతీ వికాసం, బంగారు తెలంగాణ నిర్మాణం బీజేపీకి మాత్రమే సాధ్యమని, బీజేపీని బలపరచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మత మౌఢ్యానికి ముఖ్యమంత్రి కెసిఆర్ జవాబు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్ కుటుంబ పాలనపై అమిత్ షా నిప్పులు
21వ శతాబ్దంలోనూ నల్లగొండ యువకులు ఫ్లోరైడ్తో బాధపడడం చూస్తుంటే హృదయం పగిలిపోతోందని అమిత్షా ఆవేదన వ్యక్తం చేశారు. 35 ఏళ్ల యువకులకు కూడా తెల్ల వెంట్రుకలు, ముసలితనం రావడం బాధాకరమని, మోడీ నాయకత్వంలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు.
టీఆర్ఎస్ కుటుంబ పాలనపై అమిత్ షా నిప్పులు
కేంద్రం విడుదల చేస్తున్న వేల కోట్ల రూపాయలు గ్రామాలకు వెళ్ళడం లేదని విమర్శించారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా నిలవాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన చెప్పారు. అమిత్షా హిందీలో చేసిన ప్రసంగాన్ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు తెలుగులోకి తర్జుమా చేశారు.