ఆత్మహత్య బాధనిపించింది.. శ్రవణ్పై అనుమానాలు.. అమ్మకు అతనితో ప్రాణహాని: అమృత ప్రణయ్
తన భర్త ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన తన తండ్రి మారుతీరావుకు చట్టపరంగా శిక్షపడాలని భావించానే తప్ప ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకోలేదన్నారు అమృత. ప్రణయ్ని హత్య చేయించాడన్న కోపమే తప్ప ఆయనతో తనకెలాంటి వ్యక్తిగత వివాదాలు లేవన్నారు. సూసైడ్ నోట్లో 'అమృతా.. తల్లి వద్దకు వెళ్లు..' అని ఆయన రాసినదాన్ని గౌరవించాను కాబట్టే.. కడసారి చూపుకోసం వెళ్లానని అన్నారు. కానీ తన బాబాయ్ శ్రవణ్ స్నేహితులు తనను అడ్డుకున్నారని.. అడ్డుకున్నది కుటుంబ సభ్యులు కాదని అన్నారు.తాను పాజిటివ్ మాట్లాడినా,నెగటివ్ మాట్లాడినా.. నెగటివే తీసుకుంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Recommended Video


శ్రవణ్తో తల్లికి ప్రాణహాని
తన తల్లికి నైతిక మద్దతునిస్తారని అమృత చెప్పారు. అయితే ప్రణయ్ కుటుంబాన్ని వదిలేసి రావాలంటే మాత్రం ఒప్పుకోనన్నారు. అమ్మ తన వద్దకు రావాలనుకుంటే.. తాను వేరే చోట ఉండి ప్రణయ్ తల్లిదండ్రులను,ఆమెను ఇద్దరినీ చూసుకుంటానని చెప్పారు. ప్రణయ్ చనిపోయినప్పుడు తానెంత బాధపడ్డానో.. ఇప్పుడు భర్త కోసం తన తల్లి ఎంతగా బాధపడుతుందో తెలుసన్నారు. ప్రణయ్ని హత్య చేసినా.. అతని కుటుంబం తనను చేరదీయడంతో ఒంటరిదాన్ని కాలేదన్నారు. కానీ తన తల్లి ఒంటరిదైపోయిందని.. ఆమెకు మారుతీరావు సోదరుడు శ్రవణ్ నుంచి ప్రాణహాని ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.

తండ్రి కోరిక మేరకు వెళ్లినా శ్రవణ్ స్నేహితులు అడ్డుకున్నారు..
ఉరిశిక్ష పడ్డ వ్యక్తికైనా చివరి కోరికను నెరవేరుస్తారని.. తన తండ్రి సూసైడ్ నోట్లో 'అమృతా.. తల్లి వద్దకు వెళ్లు..' అని రాసిన మాటను తాను గౌరవించానని.. అందుకు అంత్యక్రియల వద్దకు వెళ్లానని చెప్పారు. కానీ శ్రవణ్ కూతురు తనను అడ్డుకుని నెట్టివేసిందన్నారు. తమ కుటుంబ సభ్యులెవరూ ఏమీ అనలేదని.. శ్రవణ్ స్నేహితులే గో బ్యాక్ నినాదాలు చేశారని అన్నారు. ప్రణయ్ చనిపోయినప్పుడు ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డానో.. ఇప్పుడూ అంతే స్ట్రాంగ్గా ఉండాలనుకున్నానని చెప్పారు. అలా అని తండ్రి చనిపోతే బాధ లేదని కాదన్నారు.

మారుతీరావుపై శ్రవణ్ దాడి
తమ ఫ్యామిలీలో ఎప్పుడూ బాబాయ్ శ్రవణ్ మాటే చెల్లుబాటయ్యేదని.. ఆయన పెత్తనమే కొనసాగేదని అన్నారు. తన తండ్రి మారుతీరావు,శ్రవణ్కు మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయన్నారు. ప్రణయ్ హత్య విషయంలోనూ మారుతీరావును శ్రవణ్ రెచ్చగొట్టాడని అన్నారు. ఎవరినైనా ఎదిరించే మారుతీరావు సోదరుడు శ్రవణ్కి మాత్రం భయపడేవారన్నారు. ఈ మాట మిర్యాలగూడలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. ప్రణయ్ హత్య తర్వాత తన తండ్రిని శ్రవణ్ 3,4సార్లు కొట్టినట్టు తెలిసిందని.. దాంతో ఆయన వేరేవాళ్ల ఇళ్లల్లో తలదాచుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆస్తి విషయంలో మారుతీరావు,శ్రవణ్ మధ్యలో ఏం జరిగిందో తెలియదన్నారు. శ్రవణ్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న అనుమానం ఉందన్నారు.

ఆస్తిపై ఆసక్తి లేదు..
తండ్రి ఆస్తిపై ఇప్పటికీ తనకెలాంటి ఆసక్తి లేదన్నారు. ప్రణయ్ హత్య తర్వాత ఎన్నిసార్లు రాయబారం పంపినా ఒప్పుకోలేదన్నారు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఆస్తి కోసం ఎందుకు ఆశపడుతానని ప్రశ్నించారు. తన తండ్రి చావును ఎగతాళి చేశానని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని.. అందులో వాస్తవం లేదని అన్నారు. టీవీలో చూసే ఆయన ఆత్మహత్య గురించి తెలుసుకున్నామని.. అయితే స్పష్టత లేకుండా మాట్లాడవద్దనే మీడియాతో మాట్లాడలేదని చెప్పారు. ఎవరికైనా వారి పిల్లల మీద ప్రేమ ఉంటుందని.. కానీ పక్కనవాళ్ల పిల్లలను చంపే హక్కు ఎవరికీ లేదని అన్నారు. హత్య,ఆత్మహత్యా రెండూ నేరమేనని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications