ఓ నిండు గర్భిణీపై కిరాతకం .. కడుపులో బిడ్డతో సహా మంటల్లో కాల్చేసిన దారుణం
మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు అని ఓ మహానుభావుడు చెప్పిన చందంగా మనుషుల్లో మానవత్వం రోజురోజుకు మృగ్యం అయిపోతుంది . పశు ప్రవృత్తి పెరిగిన మనుషులు అత్యంత జుగుప్సాకరంగా దారుణ మారణకాండకు పాల్పడుతున్నారు. ఇక అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో జరిగింది. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే గుర్తు తెలియని ఓ నిండు గర్భిణిని అత్యంత కిరాతకంగా హతమార్చారు అగంతకులు. అంతేకాదు ఆనవాళ్లు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై రంగంపల్లి గేటు సమీపంలో ఓ మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయి కనిపించింది. రోడ్డు పక్కన ఉన్న గుంతలో పూర్తిగా కాలిపోయిన ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరిస్తున్నారు. ఆమె ఎవరు? ఆమెను హత్య చేసిన వారు ఎవరు? చంపిన తరువాత తగలబెట్టారా ? లేదా సజీవదహనం చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అంతేకాదు ఇక్కడే హత్య చేశారా లేదా? అతను హత్య చేసి ఇక్కడకు తీసుకు వచ్చి పడేశారా అన్న కోణంలోనూ విచారణ చేపట్టారు. ఆమె శరీరం గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో ఆమెను గుర్తించలేని పరిస్థితి పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. సంఘటన స్థలంలో క్లూస్ టీం ఆధారాలను సేకరించే పనిలో పడింది.ఇక అంతే కాదు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మహిళ శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆమె కడుపులోని బిడ్డ కూడా బయటికి వచ్చి మంటల్లో మాడి మసై పోయింది. ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఇంత కిరాతకంగా ఓ మహిళను హతమార్చిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.