పిలిచి అన్నం పెడితే.. కెలికి కయ్యమా? - జగన్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మోదీపైనా ఫైర్

''నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాను. బేసిన్లు, భేషజాలు వద్దని, సహజ సరిహద్దు రాష్ట్రాలుగా స్నేహ పూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాను. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది'' అంటూ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గట్టిగా బుద్ది చెబుదాం..

గట్టిగా బుద్ది చెబుదాం..


తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టుల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ కు, తప్పుడు విధానాలు అవలంభిస్తోన్న కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం ప్రగతి భవన్ లో సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ త్వరలో నిర్వహించబోయే అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏపీ, కేంద్రానికి దిమ్మతిరిగేలా.. పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థ వంతంగా వాదనలను వినిపించాలని సీఎం నిర్ణయించారు.

ఏపీని నోరెత్తకుండా చేద్దాం..

ఏపీని నోరెత్తకుండా చేద్దాం..


గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, వాటికి నీటి కేటాయింపులు కూడా పక్కాగా ఉన్నాయని, రాష్ట్రం విడిపోయిన తర్వాత అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీడిజైన్ చేసి నిర్మిస్తున్నామని, దీన్ని ఏపీ వాళ్లు పట్టడంలో అర్థమే లేదని కేసీఆర్ అన్నారు. గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిందని, ప్రతిగా ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని తెలంగాణ ప్రస్తావించిందని, దీంతో రెండింటిని కొనసాగించాలనే నిర్ణయం జరిగిందని గుర్తుచేసిన ముఖ్యమంత్రి.. ఏపీ సర్కారు మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం భావ్యం కాదన్నారు. త్వరలో జరగబోయే అపెక్స్ కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా, తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని కల్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

తిరుగులేని సమాధానాలు చెప్పాలి..

తిరుగులేని సమాధానాలు చెప్పాలి..


ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్ సాగర్ -ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతమ్మ సాగర్ ను నిర్మిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. పెన్ గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరి, ట్రిబ్యునల్ అవార్డు కూడా పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏఏ అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసిన వారికి, సందేహాలు వెలిబుచ్చిన వారికి తిరుగులేని సమాధానం చెప్పాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పుగా ఉందని కేసీఆర్ ఫైరయ్యారు. రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ.. రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగిందన్న కేసీఆర్.. ఈ విషయాన్ని ట్రిబ్యూనళ్లు సైతం స్పష్టంగా చెప్పాయని గుర్తుచేశారు. దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ, ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉందని, గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు, దక్కాల్సి ఉందని, సముద్రంలో కలిసే రెండు వేల టీఎంసీల్లో తెలంగాణకు కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాల్సి ఉందని పేర్కొన్నారు.

మోదీ సర్కారు అబద్ధాలను చాటిస్తాం..

మోదీ సర్కారు అబద్ధాలను చాటిస్తాం..

‘‘తెలంగాణ పట్ల అన్నికేంద్ర సర్కారు వైఖరి ఏమాత్రం బాగోలేదు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతర పెడుతున్నది. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు, అది జల విద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. తనకున్న హక్కు ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. అన్ని వాస్తవాలు వెల్లడిస్తాం'' అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Recommended Video

    V Hanumantha Rao About Ex MP Nandi Yellaiah | Oneindia Telugu
    జల జగడంలో 20న కీలక ఘట్టం..

    జల జగడంలో 20న కీలక ఘట్టం..

    ఆంధ్ర-తెలంగాణ జల వివాదాలను పరిష్కరించే ఉద్దేశంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఈనెల 20న జరిగే అవకాశాలున్నాయి. నిజానికి ఈనెల 5నే భేటీకి కేంద్రం పిలుపునివ్వగా, దానికి హాజరుకాబోమని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అదే మీటింగ్ ను 20వ తేదీన నిర్వహిస్తే ఒకే అని సమాచారం ఇవ్వడంతో, ఆ మేరకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలసింది. అపెక్స్ భేటీకి సంబంధించి ఒకటిరెడు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. భేటీలో ఏపీ, కేంద్రాన్ని నోరు మూయించేలా కేసీఆర్ వాదనలకు సిద్ధం అవుతుండగా, ఏపీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రిపేర్ కావాలంటూ అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించినట్లు సమాచారం. కేసీఆర్ తాజా విమర్శలపై ఏపీ సర్కారు స్పందించాల్సిఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+