బీజేపీ చేతికి మరో అస్త్రం ... బొమ్మలే కాదు అవినీతిని చెక్కుతారా! యాదాద్రిలో రాజాసింగ్ హల్ చల్
ఏ చిన్న అవకాశం దొరికినా టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్న బిజెపికి ఇప్పుడు మరో అస్త్రం దొరికింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శిల్పాలపై టీఆర్ఎస్ ప్రచారం సాగిస్తున్నదంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది బిజెపి. ఇక ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందించాలి అన్న అంతర్మధనం లో పడింది. ఇక ఇదే అదునుగా యాదాద్రిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హల్ చల్ చేస్తున్నారు.
యాదాద్రిని సందర్శించిన రాజా సింగ్ .. కేసీఆర్ పై ఫైర్
బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ శనివారంనాడు యాదాద్రి సందర్శించారు . యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రాకారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చిత్రాలను చెక్కడంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో రాజాసింగ్ యాదాద్రిని సందర్శించారు. అక్కడ శిల్పాలను పరిశీలించారు. ఆలయ ప్రాకారాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో స్తంభానికి కేసీఆర్ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపున్న అష్టభుజి ప్రాకార మండపంలో కారు గుర్తు, కేసీఆర్ కిట్, తెలంగాణ లోగోలో చార్మినార్ ను చెక్కారు. వీటిని రాజాసింగ్ శనివారం స్థానిక బిజెపి నేతలతో కలిసి పరిశీలించి సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోటాపోటీగా వైసీపీ, టీడీపీ బాధితుల సమావేశాలు.. పల్నాడులో టెన్షన్ .. పోలీసులు అలర్ట్
యాదాద్రి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని రాజాసింగ్ మండిపాటు
పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, టిఆర్ఎస్ పార్టీ ప్రచారానికి దేవాలయం శిల్పాలను వినియోగిస్తున్నారని మండిపడ్డారు రాజాసింగ్. యాదాద్రి స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలను చెక్కడంపై రాజా సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈలోగా వాటిని తొలగించకపోతే అన్ని దేవాలయాల్లో ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై నిప్పులు చెరిగిన రాజాసింగ్ ఇప్పుడు అన్ని దేవాలయాల్లో ఆందోళనలకు తెరతీయనున్నట్టు పేర్కొన్నారు.
త్వరలో టీఆర్ఎస్ ఇరకాటంలో పెట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్న బీజేపీ
యాదాద్రిపై కేసీఆర్, కారు, కేసీఆర్ కిట్టు, హరితహారం వంటి చిత్రాలను చెక్కడాన్ని వ్యతిరేకిస్తూ భజరంగ దళ్, హిందూ పరిరక్షణ సమితి, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు నిరసనకు దిగాయి. కాంగ్రెసు నేతలు కూడా యాదాద్రి వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని ప్రపంచ స్థాయి క్షేత్రంగా పునర్నిర్మించటాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆలయంపై కేసీఆర్ బొమ్మలను చెక్కడం సరి కాదని రాజా సింగ్ పేర్కొన్నారు . రాష్ట్ర నాయకత్వంతో చర్చించి త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. భావి తరాలకు తెలియజేయడానికి నాయకుల బొమ్మలను చెక్కినప్పుడు వారి అవినీతిని కూడా చెక్కుతారా అని సూటిగా ప్రశ్నించారు.