రేపిస్ట్ హత్య: అనూషను తీసుకుని పరారీ, తన చేతులతో చంపాలని తండ్రి ఇలా...
రెండేళ్ల క్రితం మరణించిన అనూషది పరువు హత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనూష మరణానికి కారణమైన గుంటి రాజేష్పై ఆమె తండ్రి కక్ష పంచుకుని స్వయంగా చంపాడని అంటున్నారు.
హైదరాబాద్: కరుడు గట్టిన నేరస్థుడు గుంటి రాజేష్ హత్య కేసు విచారణ సందర్భంగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితం నాగార్జునసాగర్లో దూకిందని భావిస్తున్న అనూషది పరువు హత్య కావచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో తన కూతురు అనూషను మోసం చేసిన గుంటి రాజేశ్ను తన చేతులతో చంపాలంటూ శపథం చేసిన శ్యాంసుదర్ రెడ్డి స్వయంగా కత్తులతో పొడిచినట్లు చెబుతున్నారు.
తన కూతురు జీవితం నాశనం కావడానికి, తన రాజకీయ జీవితం అంతం కావడానికి వాడే కారణమని, వాడిని తన చేతులతో చంపాలని, మరణించేటప్పుడు వాడు పడే బాధను కళ్లారూ చూడాలని శ్యాంసుందర్ రెడ్డి ప్రతిన చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. గత సొమవారం రాత్రి తుర్కయాంజాల్లో గుంటి రాజేష్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురిని నాటకీయంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
రేపిస్ట్ గుంటి రాజేష్ హత్య: ప్రేమ పెళ్లి పేరుతో మోసం, విక్టిమ్ తండ్రే...
అసలేం జరిగింది....
శ్యాంసుందర్రెడ్డి సతీమణి గతంలో కిడ్నీ సమస్యతో బాధపడింది. అప్పట్లో అతడి ఇంటి పనిమనిషి తన కిడ్నీని దానం చేసింది. దాంతో పనిమనిషికి శ్యాంసుందర్రెడ్డి తన స్థలాన్ని ఆమెకు ఇచ్చాడు. పనిమనిషి ఆ స్థలం వద్దకు వెళితే రాజేశ్ అడ్డుకున్నాడు. దాన్ని తనకే విక్రయించాలని, లేనిపక్షంలో వివాదం సృష్టిస్తానని పనిమనిషిని బెదిరించాడు.
ఈ క్రమంలోనే శ్యాంసుందర్రెడ్డి కుమార్తె అనూషరెడ్డితో రాజేశ్ పరిచయం పెంచుకొని ప్రేమలోకి దింపాడు. తనకు పెళ్లి అయిన విషయం దాచిపెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు. రాజేశ్ 2015 ఫిబ్రవరి 27న ఆమెని తీసుకొని పారిపోయాడు. గోవా, మధ్యప్రదేశ్, లూథియానా, దిల్లీ, మన్నార్ వెళ్లిన వారిని పోలీసులు మార్చి 12వ తేదీన పట్టుకుని హైదరాబాద్ తెచ్చారు.
అరెస్టయిన నాలుగు రోజులకే రాజేశ్ బెయిల్పై బయటికి వచ్చాడు. అదే నెల 18న తెల్లవారుజామున అనూష నాగర్జునసాగర్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. మానసిక ప్రశాంతత కోసం అనూషను కారులో తీసుకెళ్తుండగా సాగర్ వంతెన పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.
అప్పటినుంచి శ్యాంసుందర్రెడ్డి రాజేష్పై కక్ష పెంచుకున్నాడు. దాంతోనే అతను రాజేష్ను హత్య చేసినట్లు భావిస్తున్నారు. అయితే పోలీసులకు దొరకడానికి ముందు కొందరు మీడియా ప్రతినిధులతో శ్యాంసుందర్రెడ్డి - తాను హత్య చేయలేదని, అపహరణ కేసు పెట్టినందునే అనుమానిస్తున్నారని అన్నారు.
అనూష అనుమానాస్పద మృతి కేసును తిరిగి తెరుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ ఘటన జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో ఏమేరకు ఇది సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అనూషది హత్యేనంటూ..
రెండేళ్లక్రితం నాగార్జునసాగర్లో శవమైతేలిన అనూషది ఆత్మహత్యకాదని పరువు హత్య అని గుంటి రాజేష్ తల్లి శంకరమ్మ ఆరోపించారు. తన కుమారుణ్ని దారుణంగా హత్యచేసిన నిందితులను శిక్షించాలని ఆమె డిమాండ్చేశారు. ఎల్బీనగర్లోని తమ నివాసంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
శ్యాంసుందర్రెడ్డి కుమార్తె అనూష ఇష్టపూర్వకంగానే రాజేష్తో వచ్చిందని చెప్పారు. పరువుకోసం తండ్రే హత్య చేశాడని ఆరోపించాడన్నారు. ఆ కేసు ఇప్పటికీ తేలలేదని ఆమె తెలిపారు. సమావేశంలో పలువురు దళితసంఘాల నేతలు పాల్గొన్నారు.
రాజేష్ హత్య నిందితులు ఇలా...
హత్య అనంతరం నిందితులు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో దొరికిపోతామనే ఉద్దేశంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్కు తిరిగి వచ్చి హైదరాబాద్-బీజాపూర్ రహదారికి సమీపంలోని ఓ రిసార్ట్స్లో తలదాచుకున్నారు.
విషయం తెలిసి పోలీసులే అక్కడికి వస్తారనే సమాచారంతో మీడియా సహకారంతో లొంగిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రావిర్యాల వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.