సెక్షన్ 8: మాట్లాడనన్న గవర్నర్, అమలుకాదన్న టీఆర్ఎస్ ఎంపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడిచిందని, రాబోయే కాలం కూడా అలాగే గడిచిపోతుందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ అన్నారు. సెక్షన్ 8పై తానేమీ మాట్లాడబోనని, తనకు ఎలాంటి అభిప్రాయాలు లేవని ఆయన చెప్పారు.
ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలతో గురువారం భేటీ అయిన గవర్నర్ నరసింహాన్ విభజన జరిగి ఏడాది పూర్తైన సందర్భంలో ఇరు రాష్ట్రాల పురోగతి, ఏజెండాలను ముగ్గురితో చర్చించానని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఏపీ సీఏం చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయంపై మీరైనా మాట్లాడారా అన్న ప్రశ్నకు గాను అలాంటిదేమీ లేదని బదులిచ్చారు.
సెక్షన్ 8 అమలు కాదు: టీఆర్ఎస్ ఎంపీ వినోద్
హైదరాబాద్లో గవర్నర్ పాలనపై అంతటా చర్చ జరుగుతోందని, సెక్షన్ 8 అమలు కాదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అవినీతి జరిగిన సందర్భంలో విచారణ చేస్తుంటే చాలా విషయాలు బయట పడుతున్నాయని గరువారం ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు.
రాజ్యాంగ బద్దంగానే పోలీసులకు ఉన్న అధికారాలను బట్టి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ను అరెస్టు చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లను ట్యాప్ చేయలేదని, అది రికార్డింగ్ మాత్రమేనని తెలిపారు.
సీఎం ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆధారాలుంటే ముందే ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు కాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు మాత్రమే సెక్షన్ 8 అమల్లోకి వస్తుందని అన్నారు.