మాజీ స్పీకర్ అరెస్ట్ తప్పదా ... చట్ట సభలు ఏం చేస్తాయో
అసెంబ్లీ నుంచి తమ బహిష్కరణ చెల్లదంటూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ గతంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్లు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్పై జస్టిస్ బి.శివశంకరరావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్పై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యత్వ పునరుద్ధరణ కేసులో హైకోర్టు మాజీ స్పీకర్ విషయంలో కూడా సంచలన నిర్ణయం తీసుకుంది .
కోర్టు ధిక్కార కేసులో మాజీ స్పీకర్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశం .. లేకుంటే అరెస్ట్
కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరవ్వాలనిన్యాయస్థానం స్పష్టం చేసింది. లేనిపక్షంలో కోర్టు తనపని తాను చేసుకుపోతుందని వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ధిక్కార కేసులో ఇచ్చిన నోటీసులను స్పీకర్ విస్మరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ,గతంలో స్పీకర్ను అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చేలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. కోర్టు ఆదేశాలతో శాసనసభ అధికారులు, అధికార పార్టీ ఒక్కసారి షాక్ కు గురైంది. హైకోర్టు తీవ్రమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చట్టసభల ఏవిధంగా స్పందిస్తాయి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
స్పీకర్ నోటీసులను తిరస్కరించటం సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం
బహిష్కరణకు గురైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్) సభ్యత్వ పునరుద్ధరణకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కారవ్యాజ్యం ఊహించని మలుపు తిరిగింది. కోర్టు నోటీసులను తిరస్కరించిన అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారిని సుమోటోగా ఇంప్లీడ్ చేసింది. కోర్టు నోటీసులు తీసుకున్న డీజీపీ, నల్లగొండ,జోగుళాంబ గద్వాల జిల్లాల ఎస్పీలు స్పందించకపోవడాన్ని తప్పుపట్టింది. ప్రత్యేకంగా మరోసారి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.. కోర్టు ధిక్కార కేసులో తాము ఇచ్చిన నోటీసులకు ఎందుకు స్పందించలేదో మార్చి 8న వారు హాజరై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.పిటిషనర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లకు భద్రత కల్పించకపోవటానికి సంబంధించి డీజీపీ, నల్గొండ,జోగులాంబ గద్వాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రస్తుతం మధుసూదనాచారితో పాటు డీజీపీ, ఎస్పీలకు నోటీసులు జారీ చేస్తున్నామని, తదుపరివిచారణకు హాజరవుతారని భావిస్తున్నామన్నారు.
గతంలో ఈ తరహా కేసుల్లో సుప్రీం తీర్పులను ప్రస్తావించిన ధర్మాసనం
మణిపూర్ స్పీకర్ అరెస్టు, కోర్టుకు హాజరుకు సంబంధించిన మనిలాల్ సింగ్ వర్సెస్ డాక్టర్ హెచ్.బోరోబాబూసింగ్ కేసు, సీకే దెఫ్తారి వర్సెస్ ఒపీగుప్త కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ రాష్ట్ర బలగాలు సహకరించకపోతే ఏం చేయాలో తమకు తెలుసని, కేంద్ర బలగాల సాయంతో అప్పటి స్పీకర్ను అరెస్ట్ చేయించడానికీవెనుకాడబోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులను హైకోర్టు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్రిజిస్ట్రార్కు అప్పగించింది. అనంతరం రూ.10 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాక వారిద్దరూ విడుదలయ్యారు. కోర్టును అవమానించేలా వ్యవహరించారంటూ అదనపు ఏజీ రాంచందర్రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మాజీ స్పీకర్ ను అరెస్ట్ చేస్తే చట్టసభలు ఏం చేస్తాయి ?
స్పీకర్ మధుసూదనాచారి గత ఉత్తర్వులను అమలు చేయకపోగా కోర్టు నోటీసులను తిరస్కరించడం ద్వారా ధిక్కరణకు పాల్పడ్డారన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు న్యాయమూర్తి చెప్పారు.మధుసూదనాచారిని 6వ ప్రతివాదిగా చేర్చుతూ ఆదేశాలు జారీ చేశారు. అయితే శాసనసభ తీసుకున్న నిర్ణయమే అంతిమంగా ఉంటుందంటూ వీరి సభ్యత్వాల రద్దు చెల్లదని కోర్టు తీర్పు నిచ్చినప్పుడు అధికార పార్టీ వర్గాలు భావించాయి. శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య చాలా కాలంగా ఈ వ్యవహారంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ తామే గొప్ప అని భావిస్తున్న పరిస్థితి చాలాకాలంగా కనిపిస్తోంది. అయితే సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ్యత్వం రద్దు చెల్లదని కోర్టు ప్రకటించిన సమయంలో నే మాజీ స్పీకర్ మధుసూదనా చారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులతో ఈ అంశాలను పరిశీలించి, కోర్టు పంపిన నోటీసులను కూడా తీసుకోకుండా వ్యూహాత్మక మౌనం పాటించారు. అంతేకాదు గతంలో పుదుచ్చేరి అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం విషయంలో కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను సైతం అంచనావేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్పీకర్ మధుసూదనాచారి అరెస్ట్ తప్పదా? ఒకవేళ అరెస్టు చేస్తే చట్టసభల నుంచి ఎలాంటి స్పందన రాబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ వాతావరణం తాజాగా కోర్టు తీసుకున్న నిర్ణయంతో నెలకొంది .