వచ్చే 20ఏళ్ళలో కేటీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనవసరం లేదు; దావోస్ టూర్ పై ఆసక్తికరవ్యాఖ్యలు
తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తనదైన శైలిలో దూకుడు చూపిస్తున్నారు. వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తూ పెట్టుబడులను ఆకర్షించడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి చూపాయని రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
కేటీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యం లేదు: ఆశా జడేజా మోత్వాని ట్వీట్
ఇదిలా ఉంటే కేటీఆర్ దావోస్ పర్యటన నేపథ్యంలో కేటీఆర్ కు మంచి విజన్ ఉందని, ఆయనను కొనియాడుతూ ఏంజెల్ ఇన్వెస్టర్స్ ఆశా జడేజా మోత్వాని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే 20 సంవత్సరాలలో ఈ దేశానికి కేటీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఆమె వ్యాఖ్యానించారు. దావోస్ లో తెలంగాణ టీమ్ దూసుకుపోతుందని కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకెళ్లే విధంగా ఉన్నారని ఆశా జడేజా మోత్వాని తెలిపారు.
కేటీఆర్ టీం ని చూస్తుంటే సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తొస్తున్నాయి
అన్ని అంశాలపైనా స్పష్టమైన అవగాహన, ఆలోచనల్లో స్పష్టత, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి నాయకుడిని నేను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు అంటూ ఆశా జడేజా మోత్వాని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక కేటీఆర్ టీం ని చూస్తుంటే సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకొస్తున్నాయి అంటూ ఆశా జడేజా మోత్వాని వెల్లడించారు. ప్రస్తుతం ఆశా జడేజా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆశ జడేజా మోత్వాని 2000లో సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆమె ప్రపంచ వ్యాప్తంగా 200 కు పైగా టెక్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు.
కేటీఆర్ విజన్ పై నెటిజన్ల ప్రశంసలు
మంత్రి కేటీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో, పెద్దపెద్ద సంస్థలను హైదరాబాదులో ఏర్పాటు చేసేలా ఒప్పించడంలో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం కొనియాడుతున్నారు. ఇక కేటీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున కేటీఆర్ దావోస్ టూర్ పై ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. దావోస్ టూర్ లో కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారని చెప్తున్నారు.
కేటీఆర్ దావోస్ టూర్ ... తెలంగాణాకు పెట్టుబడుల ఆకర్షణ
ఇదిలా ఉంటే దావోస్ రాష్ట్రంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీల తరువాత ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు రెడీ అయ్యాయి. తెలంగాణాలో తమ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రముఖ బీమా సంస్థ - స్విస్ రీ, ఈ కామర్స్ సంస్థ- మీషో, స్పానిష్ ఫార్మా కంపెనీ - కీమో మరియు లూలు గ్రూప్ తో పాటు తాజాగా ఆశీర్వాద్ పైప్స్ గ్రూప్ కూడా తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.