రొట్టమాకురేవులో నందిని సిధారెడ్డికి అవార్డు ప్రదానం
హైదరాబాద్: కేరళ లో 'తుంచన్' అనే కవి స్మారకంగా నిర్మించిన "తుంచన్ మెమొరియల్ ట్రస్ట్ ", హైదరాబాద్ లోని "లమకాన్" , 'గోల్డెన్ త్రెషొల్డ్' లను ఆదర్శంగా తీసుకొని ఖమ్మం జిల్లా, సింగరేణి (కారేపల్లి) మండలం, రొట్టమాకురేవు గ్రామంలోని ఈ నిర్మాణంలో లైబ్రరీని , సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు కవి యాకూబ్ చెప్పారు. భవిష్యత్తులో అదొక కల్చరల్,పొయెట్రీ సెంటర్ గా ఎదగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఆ లైబ్రరీని ప్రముఖ రచయిత ఎన్. వేణుగోపాల్ ఈ నెల 10వ తేదీన ప్రారంభిస్తారు. కెఎల్ పుస్తక సంగమం అని దానికి నామకరణం చేసినట్లు కవి యాకూబ్, సీతారాములు, మహబూబ్ పాషా చెప్పారు.
ఏటా అక్టోబరు 10 న ఇచ్చే "షేక్ మహమ్మద్ మియా, కె.ఎల్. నరిసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక కవితా పురస్కారాల ప్రదానానికి కూడా ఇదే వేదికగా ఉంటుంది. నిరుడు ఈ అవార్డులను సౌభాగ్య,అరుణ్ సాగర్, షాజహానా, నందకిషోర్లకు ప్రదానం చేశారు. ఏ ఏడాది అక్టోబరు 10న ఈ అవార్డులను ఖమ్మం జిల్లా రొట్టమాకురేవులో నందిని సిధారెడ్డి, మోహన్ రుషి, హిమజ అందుకుంటారు.
ఈ నెల 10వ తేదీన జరిగే కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తన కవితా సంకలనం ఇక్కడి చెట్ల గాలికి షేక్ మహమ్మద్ మియా స్మారక పురస్కారాన్ని అందుకుంటారు. ఆ పుస్తకాన్ని సీతారాం పరిచయం చేస్తారు. కెఎల్ నరసింహారావు స్మారక పురస్కరాన్ని జీరో డిగ్రీ కవితా సంకలనానికి గాను మోహన్ రుషి అందుకుంటారు. ఆ కవితా సంకలనాన్ని వంశీకృష్ణ పరిచయం చేస్తారు.
పురిటిపాటి రామిరెడ్డి స్మారక పురస్కారాన్ని సంచీలో దీపం కవితాసంకలనానికి హిమజ అందుకుంటారు. ఈ పుస్తకాన్ని సత్యశ్రీనివాస్ పరిచయం చేస్తారు. ప్రపంచంలోని అత్యున్నత అవార్డు సాధించిన కార్టూనిష్టు శంకర్కు అభినందన సత్కారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు ప్రసేన్ అధ్యక్షత వహిస్తారు.
అతిధులుగా కట్టా శేఖర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, గోరటి వెంకన్న , కె.విరాహత్ అలీ, జూలూరి గౌరీశంకర్, కాసుల ప్రతాపరెడ్డి, పోలీసు సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి, సాదిక్ అలీ హాజరవుతారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ రావు, న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, 'బాలోత్సవ్' డా.వాసిరెడ్డి రమేష్ బాబు, దాసరి అమరేంద్ర, కొండపల్లి ఉత్తంకుమార్, కటుకోఝ్వల ఆనందచారి, డా.సామినేని రాఘవులు, ఉషాకిరణ్ అభినందనలు తెలియజేస్తారు.