దేశానికి బీజేపీ పీడ పోవాలి.. దేశ ప్రజలు కేసీఆర్ వెంట రావాలి: బాల్క సుమన్
దేశంలో అధికారంలో ఉన్న బిజెపి పై తెలంగాణ మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ వర్సెస్ కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రధానంగా దృష్టి సారించి బిజెపి ముక్త్ భారత సాధించాలని దేశ ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. దీంతో తాజాగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ దేశ భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ తో పాటు ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని పేర్కొన్నారు.
కేంద్రం దేశం కోసం పని చెయ్యటం లేదన్న బాల్క సుమన్
కేంద్రం దేశం కోసం పని చేయడం లేదని విమర్శలు గుప్పించిన బాల్క సుమన్ బీజేపీ పాలనలో మత విద్వేషాలు పెరిగిపోతున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు అని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా సరైన నాయకుడు కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్న బాల్క సుమన్, కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టాల్సిందేనని, త్వరలో ఆ పని జరగబోతుందని తేల్చిచెప్పారు.
దేశాన్ని కాపాడటం కోసం నడుం బిగించాల్సిన సమయం
దేశంలోని అన్ని వర్గాల వారు కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నారని దేశాన్ని కాపాడటానికి నడుం బిగించాల్సిన సమయం వచ్చిందని బాల్క సుమన్ పేర్కొన్నారు. దేశానికి ఏం కావాలో సీఎం కేసీఆర్ చెబుతున్నా, కేంద్రంలోని బిజెపి సర్కార్ అదేమీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బంగారు భారత్ కోసం కేసీఆర్ ముందుకు సాగాలని, కేసీఆర్ వెంట టిఆర్ఎస్ శ్రేణులు ఉంటాయని బాల్క సుమన్ స్పష్టం చేశారు. నయా భారత్ కోసం కేసీఆర్ అడుగులు పడాలని కోరిన బాల్క సుమన్ తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న పథకాలు, ఇతర రాష్ట్రాల్లోనూ అమలు కావాలని కోరారు.
దేశంలో రాక్షస పాలన అంతం కావాలి.. నయా పాలనకు పునాది పడాలి
దేశంలో రాక్షస పాలన అంతం కావాలని నయా పాలనకు పునాది పడాలని ఆకాంక్షించారు. కేసీఆర్ రాక కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు. చేతగాని దద్దమ్మల అసమర్ధ పాలనలో దేశం ఉందని పేర్కొన్న బాల్క సుమన్, దేశాన్ని ముందుకు నడిపించడానికి సీఎం కేసీఆర్ వంటి సమర్ధుడైన నాయకుడి నాయకత్వం అవసరమని తేల్చి చెప్పారు.