కోదండరాంపై బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్, సోనియా గాంధీతో సీక్రెట్గా..!
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం పైన తెలంగాణ రాష్ట్ర ఎంపీ బాల్క సుమన్ మంగళవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అంతేకాదు, ఆయన విషయమై షాకింగ్ ఆరోపణ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట, తుంగతుర్తి టిక్కెట్లు ఇప్పించుకున్నారని చెప్పారు.
జేఏసీ ముసుగులో కోదండరాం తమ ప్రభుత్వం పైన దాడి చేస్తున్నారని విమర్శించారు. కోదండరాం ద్రోహి అని, ఆయనను ప్రజలు నమ్మవద్దని కోరారు. కోదండరాం నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. కోదండరాం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
సోనియా గాంధీని ఆయన ఎందుకు కలిశారో చెప్పాలని నిలదీశారు. తెరాసను ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ.. కోదండరాంతో పోరాటం చేయిస్తోందన్నారు. మొదటి నుంచి కోదండకు కాంగ్రెస్ వాసనలు ఉన్నాయని చెప్పారు. కోదండరాం ఇద్దరు కాంగ్రెస్ నేతలకు నర్సంపేట, తుంగతుర్తిల నుంచి టిక్కెట్లు ఇప్పించుకున్నారన్నారు.
కావాలనే తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను కోదండరాం విమర్శిస్తున్నారన్నారు. కావాలని బురద జల్లడం విడ్డూరమన్నారు. మల్లన్న సాగర్ఫై రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ఉద్యమకారుని ముసుగులో కోదండరాం ప్రభుత్వంపై దాడి చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు కోదండరాం పని చేస్తున్నారని చెప్పారు. ఓ వైపు రాజకీయాలు వద్దంటూనే కాంగ్రెస్తో కలిసి పని చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్తో కోదంరాంకు సంబంధాలున్నాయన్నారు.
కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. సోనియాను రహస్యంగా కలవాల్సిన అవసరం కోదండకు ఏం వచ్చిందన్నారు. జూలై 16, 27 తేదీల్లో సోనియాతో సమావేశమయ్యారన్నారు. కాంగ్రెస్ ఆడుతోన్న నాటకంలో కోదండరాంది శిఖండి పాత్ర అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తే ప్రజలు సహించరన్నారు. కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు.