కేసీఆర్ దొంగ దీక్ష వివరాలు: రాళ్లతో కొట్టారుగా.. జైపాల్పై సుమన్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుది దొంగ దీక్ష అని, ఆయన దొంగ దీక్ష గురించి నిమ్స్లో వివరాలు ఉన్నాయని చెప్పిన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి పైన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జైపాల్రెడ్డి తెలంగాణకు మోసం చేసిన చరిత్రహీనుడన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును విమర్శించే నైతిక అర్హత జైపాల్ రెడ్డికి లేదన్నారు. దొంగ దీక్షలు, దొంగ రాజీనామాల చరిత్ర కాంగ్రెస్దే అన్నారు. తెలంగాణకు జైపాల్ రాళ్లెత్తిన కూలీ కాదని, ఉద్యమకారులతో రాళ్లు, చెప్పులు వేయించుకున్న నేత అన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. కెసిఆర్ పచ్చి అవకాశవాది అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
అవసరం ఉంటే తప్ప కేసీఆర్ ఎవరినీ పొగడరని పాయింట్ లాగారు. 2019లో తెరాస నేతలు గ్రామాల్లో తిరగలేరని చెప్పారు. కెసిఆర్ తన రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. కేబినెట్లో తెలంగాణ ద్రోహులే ఎక్కువగా ఉన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీదే తప్ప అందులో కేసీఆర్ పాత్ర లేదన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ దొంగ దీక్షలు చేశారని దుయ్యబట్టారు. దీక్షకు సంబంధించిన సమాచారం అంతా నిమ్స్లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.