రేవంత్! భాష మార్చుకో!!: బాల్క సుమన్, కేంద్రం మొండిచేయి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనశభ్యుడు రేవంత్రెడ్డిపై, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బాల్కసుమన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్రెడ్డి చేస్తున్న విమర్శలపై ఆయన బుధవారంనాడు స్పందించారు.
రేవంత్రెడ్డి తన భాష తీరు మార్చుకోవాలని, రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ పెట్టింది పేరు అని ఆయన అన్నారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ సభల్లో నిరసన వ్యక్తం చేయడం సరైంది కాదని అన్నారు. బీజేపీని మందకృష్ణ నిలదీయకపోవడంలో మతలబేమిటని అడిగారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పేట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పది వేల ఇండ్ల నిర్మాణానికి మాత్రమే ఆమోదం తెలపడంపై బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. ఏపీకి 1,93,147 ఇండ్లను కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన వాటాను తీసుకొస్తామని చెప్పారు. అన్ని రంగాల్లోనూ కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
ఏపీకి 1,93,147 ఇండ్లను కేటాయించి తెలంగాణకు 10 వేల ఇండ్లు కేటాయించడంపై పార్లమెంట్ సమావేశాల్లో తీవ్రంగా ప్రతిఘటిస్తామని తేల్చిచెప్పారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని చేపట్టిందని చెప్పారు. ఇలాంటి గొప్ప పనులను వెంకయ్యనాయుడు, చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు. వరంగల్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు.