సుప్రీం తీర్పుతో కిక్కుకు చెక్: రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం
జాతీయ రహదారులపై మద్యం అమ్మకాలు నిషేధించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో వరంగల్ లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడుతాయని అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
వరంగల్: జాతీయ రహదారులపై ఇటీవల ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ఇందులో 90 శాతం మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే చోటు చేసుకుంటున్నాయని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెల్లడించింది.
జాతీయ రహదారులకు 100 మీటర్ల లోపు ఎలాంటి మద్యం దుకాణాలు ఉండొద్దని చెప్పింది.. ఇలాంటి వాటికి వచ్చే ఏడాది నుంచి లైసెన్సులు జారీ చేయవద్దని వివరించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు జాతీయ రహదారులు (హైదరాబాద్ నుంచి భూపాలపట్నం 163, సిరోంచ నుంచి ఆత్మకూరు 363, నకిరేకల్ నుంచి మల్లంపల్లి 365) ఉన్నాయి.
ఇవి పలు పట్టణాలు, మండలాలను కలుపుతూ వెళ్తున్నాయి. వీటిపై సుమారు 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున బార్, మద్యం దుకాణాలున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో వీటిని ఎత్తివేస్తారు. 100 మీటర్లకు పైగా దూరంలో ఏర్పాటు చేసుకోవాలి.
రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..
దేశ వ్యాప్తంగా రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వారు మద్యం దుకాణాలు కనిపిస్తే.. అక్కడ ఆగి మద్యం తాగుతున్నారు. పూటుగా తాగి మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. వీటి నివారణకు పోలీసులు పలు చర్యలు చేపడుతున్నా.. ప్రమాదాలను తగ్గించలేకపోతున్నారు.

ఈ తరుణంలో సుప్రీం తీర్పు కీలకం కానుంది. దీనివల్ల ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని నిపుణులు అంటున్నారు. తీర్పును కచ్చితంగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుందంటున్నారు. ఉదాసీనంగా వ్యవహరిస్తే.. పాత కథే అవుతుందంటున్నారు.
ఇటీవల ప్రమాదాలు..
15 రోజుల క్రితం పరకాలకు చెందిన నలుగురు యువకులు మద్యం తాగి కారును నడుపుతూ హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై ఉన్న డివైడర్ను ఢీకొట్టారు. మంటలు లేచి కారు కాలింది. ఇందులో ఉన్న వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం పోలీసు విచారణలో వెల్లడైంది.
వారం రోజుల క్రితం ముగ్గురు యువకులు మద్యం తాగి మోటారు సైకిల్పై వరంగల్ - కాజీపేట ప్రధాన రహదారిపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
నెల రోజుల కిత్రం హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో కారును ఢీకొని విద్యార్థి మృతి చెందాడు. రెండు నెలల క్రితం సుబేదారి పోలీసుస్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడుపుతూ జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.












Click it and Unblock the Notifications