నాతో కెసిఆర్ రావాలి: కెటిఆర్ సవాల్పై బండారు దత్తాత్రేయ షరతు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించడంలో తాను ఎక్కడా రాజీపడటం లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనతో వస్తే ప్యాకేజీ ఇప్పిస్తానని చెప్పారు.
రాష్ట్రానికి తొలుత కేంద్రం తక్కువగా ఇళ్లు మంజూరు చేసిందని, ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి తాను 42వేల ఇళ్లు మంజూరు చేయించానని చెప్పారు. తాజాగా కరువు నిధుల విషయంలో కూడా రూ.300 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు.
కెసిఆర్ ప్రకటించిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు గొప్ప పథకమని, దానికి కేంద్రం తప్పకుండా సహకరిస్తుందని చెప్పారు. అయితే, కెసిఆర్ తనతో పాటు కలిసి వచ్చి ప్రధాని మోడీని అడిగితే ఆయనను ఒప్పించి తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ తప్పకుండా ఇప్పిస్తానని చెప్పారు. కాగా, ఇటీవల తెరాస నేత కెటిఆర్ మాట్లాడుతూ... బిజెపి నేతలు కేంద్రం నుంచి రూ.లక్ష కోట్లు తెచ్చి మాట్లాడాలన్నారు.
వారంలోగా కేంద్ర కరువు నిధులు: రాధామోహన్ సింగ్
తెలంగాణకు కరువు సహాయం నిధులు వారంలోగా మంజూరు చేస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. తెలంగాణలో ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.200 కోట్లు కేటాయించామని, జనవరి 7న దీనికి శంకుస్థాపన జరుగుతుందని ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం నాడు కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ను కలిశారు.
ఈ సందర్భంగా రాధామోహన్ సింగ్ మాట్లాడుతూ... తెలంగాణలో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ప్రధాని మోడీ రూ.200 కోట్లు కేటాయించారన్నారు. కరవు వల్ల రూ.2500 కోట్లు నష్టం సంభవించినట్లు తొలుత రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని, ఆ తర్వాత రూ.3,000 కోట్లకు అనుబంధ నివేదికను పంపించిందన్నారు.