దోస్తీ కటీఫ్: బాబుకు ఈ'సారీ' దత్తాత్రేయ షాక్, లెక్కచెప్పిన కిషన్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశంపై తెలంగాణ బిజెపి నేతలు మరోసారి వ్యాఖ్యలు చేశారు. టిడిపితో దోస్తీకి తెలంగాణ బిజెపి నేతలు ఏమాత్రం సుముఖంగా లేరు. ఆ విషయాన్ని వారు చాలాసార్లు బాహాటంగానే చెబుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ టిడిపితో పొత్తుపై స్పందించారు.
తన వ్యాఖ్యల ద్వారా చంద్రబాబుకు, తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డికి షాకిచ్చారనే చెప్పవచ్చు. 2019లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. ఎవరితోను పొత్తు ఉండదని స్పష్టం చేశారు. దత్తాత్రేయ మాట్లాడుతూ... తెలంగాణలో టిఆర్ఎస్కు బిజెపియే ప్రత్యామ్నాయం అని చెప్పారు.
తెలంగాణలో ఇకపై ఏ ఎన్నికల్లోనూ టిడిపితో కలసి పోటీ చేయబోమన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి కోసం కేంద్ర పార్టీ ఏకాభిప్రాయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో టిడిపి పూర్తిగా మాయమైనట్టేనని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
విభజన చట్టంలోని హామీలను దశలవారీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. ఏపీలో టిడిపితో పొత్తుపై భవిష్యత్ నిర్ణయాలను మాత్రం ప్రస్తావించలేదు.
తప్పుడు కేసులు: కిషన్ రెడ్డి
హెచ్సియు ఘటన పైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్ర రావుల పైన తప్పుడు కేసులు నమోదు చేశారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్రం ఇచ్చిన లెక్కలు చెప్పారు. కేంద్రం ఇన్ని ఇచ్చినా ఇవ్వలేదని చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని, ప్రధాని మోడీని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.
తెలంగాణ కోసం టిఆర్ఎస్ ఒక్కటే ఉద్యమించలేదన్నారు. తెరాస సర్కార్ ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యం ఇస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువును నివారించడంలో విఫలమైందన్నారు. కనీసం మంచినీళ్లు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదన్నారు.