బండారు విజయలక్ష్మి పొలిటికల్ ఎంట్రీ: దత్తాత్రేయ కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: దసరా పర్వ దినం సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గురువారం అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలోనే అలయ్ బలయ్
2005 నుంచి బండారు దత్తాత్రేయ దసరా పండగ సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీలో సీనియర్ నేత అయిన బండారు దత్తాత్రేయ గతంలో రెండు పర్యాయాలు కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె విజయలక్ష్మి రాజకీయ ప్రవేశంపై ఈ కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ ప్రవేశంపై బీజేపీదే తుది నిర్ణయమన్న విజయలక్ష్మి
కాగా, తన రాజకీయ ప్రవేశంపై దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తనకు అవకాశం కల్పించే అంశంపై తుది నిర్ణయం బీజేపీదేనని చెప్పారు. తాను పార్టీకి పనికొస్తానని భావిస్తే.. సేవలను తప్పకుండా వినియోగించుకుంటుందని వ్యాఖ్యానించారు.
బీజేపీ కోసం పనిచేస్తామన్న బండారు విజయలక్ష్మి
బీజేపీలో ఒక ఏరియా అనుకుని పనిచేయరని, తాము పార్టీ కోసం పనిచేస్తామని విజయలక్ష్మి తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గం అనే కాదు.. ఎక్కడి నుంచైనా పార్టీ అవకాశం ఇవ్వవచ్చని ఆమె చెప్పారు. బీజేపీ అధిష్టానం చెప్పిన ప్రకారం నడుచుకుంటానని విజయలక్ష్మి స్పష్టం చేశారు.
అందుకోసమే అలయ్ బలయ్ అంటూ విజయలక్ష్మి
ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ సంస్కృతిని అందరికీ గుర్తు చేసేందుకు అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించామని బండారు విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఇతరత్రా కార్యక్రమాలు ఉండటంతో ఈరోజుల అలయ్ బలయ్ కార్యక్రమానికి రాలేకపోయారని ఆమె వెల్లడించారు. కాగా, బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ 2018లో గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలోనే దత్తాత్రేయ రాజకీయ వారసులుగా విజయలక్ష్మి రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా సేవలను వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు.