టూత్ పాలిష్ వ్యక్తుల సవాళ్లకు స్పందించను; కేటీఆర్ సవాల్ కు బండి సంజయ్ ఘాటు రిప్లై
తెలంగాణ మంత్రి కేటీఆర్ కరీంనగర్ వేదికగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశాడని ప్రశ్నించిన కేటీఆర్, ఎంపీగా ఎన్నికైన మూడేళ్లలో కనీసం మూడు కోట్ల నిధులైనా తీసుకురాలేదు అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ వల్ల కరీంనగర్ కు అర పైసా లాభం కూడా జరగలేదని పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా నోరు విప్పారా అంటూ ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ ఒక విద్యా సంస్థ గాని, వైద్య కళాశాలను గాని, కనీసం ఒక గుడిని కానీ బండి సంజయ్ తీసుకురాలేకపోయారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గంగుల కమలాకర్ పై పోటీ చేసి గెలవాలని బండి సంజయ్ కు సవాల్ విసిరారు కేటీఆర్.

మంత్రి కేటీఆర్ సవాల్ కు ఘాటుగా బదులిచ్చిన బండి సంజయ్
మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ కు బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ లాగా ఏక్ నిరంజన్ పార్టీ కాదని, తాము ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయమని బండి సంజయ్ పేర్కొన్నారు. టూత్ పాలిష్ వ్యక్తుల సవాళ్లకు తాను స్పందించనని బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ నీ అయ్య తెలంగాణా ద్రోహి
కేటీఆర్ నీ అయ్య తెలంగాణ ద్రోహి అంటూ మండిపడిన బండి సంజయ్ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా జరిగిన చర్చలో కేసీఆర్ లేడని విమర్శించారు. కెసిఆర్ తాగి ఎక్కడ పడుకున్నాడని, దొంగ దీక్షలు చేశాడని విమర్శించారు. బహిరంగసభల్లో ఏది పడితే అది కేసీఆర్ మాట్లాడుతున్నారు అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతోందని బండి సంజయ్ మరోమారు తేల్చి చెప్పారు. జాతీయ రహదారులకు ఉపాధి హామీ నిధులు తెచ్చింది తామే అంటూ బండి సంజయ్ వెల్లడించారు.

సభలో ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకోవడం సిగ్గుచేటు
స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గులేకుండా మళ్లీ కేంద్రం ఏమి ఇవ్వటం లేదని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ లో నిన్న ప్రారంభోత్సవం చేసిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్.

సీఎం కేసీఆర్ కుటుంబమే అటువంటిది.. మొరగటం వాళ్లకు అలవాటు
టీఆర్ఎస్ నేతల మాటలకు జనం నవ్వుకుంటున్నారని పేర్కొన్న బండి సంజయ్ తానేమీ చేయలేదని టీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని, డ్రమ్ము లో రాళ్ళు వేసి సౌండ్ చేసినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయినా సీఎం కేసీఆర్ కుటుంబమే అటువంటిది అని, ఏది పడితే అది మొరగడం వాళ్లకు అలవాటేనని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని పేర్కొన్న బండి సంజయ్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు.

కేంద్రంపై ఏడవటం సిగ్గు చేటు
టిఆర్ఎస్ ప్రభుత్వం అసలు తెలంగాణకు ఏం చేసిందో చెప్పకుండా కేంద్రంపై ఏడవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తనకు మత పిచ్చి ఉందని చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా తాను హిందువునని సగర్వంగా చెప్పుకుంటా అంటూ పేర్కొన్నారు బండి సంజయ్ . ఏది పడితే అది వాగితే జనం త్వరలో వాతలు పెడతారన్న విషయం గుర్తుంచుకోవాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications