ఇది పట్టణ ప్రగతి కాదు.. పట్టణాలకు పట్టిన దుర్గతి: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ హయాంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, పట్టణాలలో ప్రగతి ఎలా ఉంది అన్న దానిపై ప్రతి జిల్లాలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాక పూర్వం పట్టణాల పరిస్థితి ఏమిటి? వచ్చిన తర్వాత పట్టణాల పరిస్థితి ఏమిటి అన్నది చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం కెసిఆర్ పాలనలో సాధించిన ప్రగతిని చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పట్టణ ప్రగతి కార్యక్రమంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా సంచలన పోస్ట్ పెట్టారు. కెసిఆర్ హయాంలో జరిగింది పట్టణ ప్రగతి కాదని, పట్టణాలకు పట్టిన దుర్గతి అని బండి సంజయ్ పోస్ట్ చేశారు.

రాష్ట్రంలో తాజా పరిస్థితులను, రాష్ట్రవ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న పట్టణాల తీరును చెబుతున్న బండి సంజయ్ డల్లాస్, లండన్ ముచ్చట్లతో రాష్ట్రం ఆగమాగం అయిందని పేర్కొన్నారు. హైదరాబాద్లో పరిస్థితిని వివరించిన బండి సంజయ్ హైదరాబాద్లో వాన వస్తే వరద ఖాయమని, రోడ్లపైన మొత్తం ట్రాఫిక్ భయమని వెల్లడించారు. హుస్సేన్ సాగర్ ఇంకా మురికి మయంగానే ఉందని, మూసీ నది ఇంకా శుభ్రం కాలేదని పేర్కొన్నారు.
వరంగల్ కు వరద భయం తీరలేదని బండి సంజయ్ వెల్లడించారు. పట్టణాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు భాగంగా ఉన్నాయని పేర్కొన్న బండి సంజయ్, పట్టణాలు స్వచ్ఛతకు, శుభ్రతకు ఆమడదూరం అన్నట్టుగా తయారయ్యాయి అని పేర్కొన్నారు. డల్లాస్, లండన్ ముచ్చట్లతో అంతా నాశనం చేశారని ఇది పట్టణ ప్రగతి కాదు పట్టణాలకు పట్టిన దుర్గతి అంటూ కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
పట్టణ ప్రగతి పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా రాష్ట్రంలో ఎక్కడా ప్రగతి కనిపించడం లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇదంతా వచ్చే ఎన్నికల కోసమే అన్నట్టు పేర్కొన్న బండి సంజయ్ తన పోస్టు ద్వారా పట్టణ ప్రగతిపై అందరిని ఆలోచించేలా చేశారు. కేసీఆర్ సర్కార్ ను తూర్పారబట్టారు.












Click it and Unblock the Notifications