కేసీఆర్ నాందేడ్ సభ తుస్సుమంది: చేరికలపైనా బండి సంజయ్ సెటైర్లు
తెలంగాణలో కేసీఆర్కు ప్రాధాన్యత లేదని, మహారాష్ట్రలో కేసీఆర్ను ఎవరు పట్టించుకుంటారని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ నాందేడ్ సభ అట్టర్ ఫ్లాప్, కాలం చెల్లిన వాళ్లే పార్టీలో చేరారని బండి సంజయ్ సెటైర్ వేశారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ నాందేడులో నిర్వహించిన సభపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన బిఆర్ఎస్ నాందేడ్ సభ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నాందేడులో బిఆర్ఎస్ నిర్వహించిన సభ మెగా ఫ్లాప్ షో అంటూ ఆయన మండిపడ్డారు.

కాలం చెల్లిన నాయకులందరూ బీఆర్ఎస్ లో : బండి సంజయ్
బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహారాష్ట్ర అగ్రనేతలు ఎవరు అని అందరూ ఆశ్చర్యపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమ గ్రామంలో కనీసం 10 ఓట్లు కూడా సాధించలేని నాయకులే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కాలం చెల్లిన నాయకులందరినీ బీఆర్ఎస్ పార్టీ రండి బాబు రండి అని ఆహ్వానిస్తుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లోకి చేరికల సమయంలో కేసీఆర్ ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపించిందని, బండి సంజయ్ పేర్కొన్నారు.

రైతుల గురించి కేసీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించటమే
ఇక ఇదే సమయంలో కేసీఆర్ రైతుల గురించి మాట్లాడ్డం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యల పరంగా, దేశంలో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని పేర్కొన్న బండి సంజయ్, తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్ర జనాభా 3 రెట్లు ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి కూడా తన సొంత గజ్వేల్లో రైతుల ఆత్మహత్యలను ఆపడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు.

తెలంగాణా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నాందేడ్ లో మకాం వేసి చేసిందిదే
మేధావిలా ప్రవర్తిస్తున్న కేసీఆర్ నీటిపారుదల, తాగునీటి సరఫరా, విద్యుత్, రోడ్ల మౌలిక సదుపాయాలపై గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారని, కెసిఆర్ మాటలు ప్రకటనలకే పరిమితం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు . తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అయిందని కేవలం వాక్చాతుర్యంతో మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుండి ప్రజలను సమీకరించడానికి మనిషికి 500 రూపాయలు చొప్పున ఇవ్వడానికి మాత్రమే నాందేడ్ కు వెళ్లారంటూ దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ నాందేడ్ సభ తుస్సుమంది
బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ తుస్సుమందని ఎద్దేవా చేసిన ఆయన 25 రోజులుగా బీఆర్ఎస్ నేతలు మకాం వేసి మరీ ఏర్పాట్లు చేసినా మహారాష్ట్ర జనాలు పట్టించుకోలేదని కేసీఆర్ సభ ఫెయిల్ అయిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోనే అతిగతీలేదు నాందేడ్ లో బిఆర్ఎస్ ని ఎవరు పట్టించుకుంటారు అంటూ ప్రశ్నించారు. నిన్న బిఆర్ఎస్ లో చేరిన వారంతా అవుట్ డేటెడ్ గాళ్లే అని ఆయన వ్యాఖ్యానించారు. వేల సంఖ్యలో బీఆర్ఎస్ కండువాలు తీసుకుని వెళితే ఆ కండువాలు పట్టుకొని కేసీఆర్ నిలబడినప్పటికీ ఎవరూ రాకపోతే ఆయన విసుక్కున్నారు అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో అందరికీ అర్థమవుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

కొత్త దుకాణం పేరుతో కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారు
మహారాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడం కోసం కేసీఆర్ రకరకాలుగా ప్రయత్నాలు చేశారని, అయితే వారెవరు కేసీఆర్ ను నమ్మబోరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సంగతి అర్థమయ్యే తిరగబడుతున్నారని, ఇది తెలిసే తట్ట బుట్ట సర్దుకుని కొత్త దుకాణం పేరుతో కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయినా కేసీఆర్ పప్పులు ఏమీ ఉడకవని పేర్కొన్న బండి సంజయ్ వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని సమాధి చేయడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications