కేసీఆర్కే దిక్కు దివాణా లేదు.. కవితను ఎవరు పట్టించుకుంటారు: ముందస్తుపైనా బండి సంజయ్ సెటైర్లు!!
తెలంగాణ సీఎం కేసీఆర్ తన బిడ్డను బిజెపిలోకి లాగాలని చూస్తున్నారు అని బిజెపి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ ని పట్టించుకునేవారు లేరు.. ఇక కెసిఆర్ కూతురుని పట్టించుకునే వారు ఎవరు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అధికారం కోసం కుటుంబ సభ్యులను వాడుకునే రకం కేసీఆర్ అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

కేసీఆర్ ముందస్తుకు వెళ్ళను అంటే అర్ధం ఇదే : బండి సంజయ్
కేసీఆర్ ముందస్తుకి వెళ్ళను అంటే వెళతారు అని అర్థం అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ లోపల భయం మొదలైందని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి ఆ పార్టీ నేతలకు అర్థం అయింది అన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలని కేసీఆర్ చెబుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ మారాలనుకునే వారిని చెప్పుతో కొట్టాలన్న కెసిఆర్ మరి ఇతర పార్టీల నుంచి 37 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారు అనుకుంటే అలా కాకుండా పక్క పార్టీ నేతలను టిఆర్ఎస్ పార్టీ లోకి ఎలా తీసుకురావాలి? ఇతర పార్టీలపై ఏ విధంగా బురద చల్లాలి అన్నది లక్ష్యంగా పెట్టుకొని కెసిఆర్ పని చేస్తున్నారని ఆరోపించారు.

ఆ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎందుకు గంప క్రింద కమ్మి పెట్టారు
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఎందుకు బయటకు రావడం లేదో .. వారిని కెసిఆర్ గంప కింద ఎందుకు కమ్మిపెట్టారో అర్థం కావడం లేదని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రమాదకరస్థాయిలోకి తీసుకెళ్లాడని, బ్యూరోక్రాట్లు కెసిఆర్ కాళ్లు మొక్కుతున్నారు అని.. ఒకసారి మొక్కితే ఎమ్మెల్సీ, రెండుసార్లు మొక్కితే ఎమ్మెల్యే, మూడుసార్లు మొక్కితే మంత్రి పదవి ఇస్తారంటూ బండి సంజయ్ షాకింగ్ కామెంట్ చేశారు. కెసిఆర్ కి వ్యతిరేకంగా ఉన్న వారంతా పార్టీలకతీతంగా బిజెపికి ఓటు వేయాలని పేర్కొన్నారు బండి సంజయ్.

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫోన్ టాపింగ్ చేస్తోంది సీఎం కేసీఆర్ నే
వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, ఆ భయంతోనే గెలుపు కోసం కెసిఆర్ అడ్డదారులు తొక్కుతున్నారు అని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫోన్ టాపింగ్ చేస్తోంది సీఎం కేసీఆర్ నే అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని వస్తే కలవకుండా కేసిఆర్ ముఖం ఎందుకు చాటేస్తున్నారో చెప్పాలని, ప్రధాని అంటే కేసీఆర్ కి ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వలేదు అనుకుంటే మీటింగ్ కు వచ్చి ఎందుకు అడగలేదని బండి సంజయ్ నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్ కు దిక్కు దివాణా లేదని మునుగోడులో వంద మంది ఎమ్మెల్యేలను మోహరించి, ఇక దేశమంతా ఎలా పోటీ చేస్తారని బండి సంజయ్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ప్రతి చోటాభూకబ్జాలు, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు.

బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతారన్న వార్తల్లో నిజం లేదు
కెసిఆర్ నియంత పాలనకు చరమగీతం పాడడానికి బిజెపి ఎంతవరకైనా సిద్ధంగా ఉంటుందని బండి సంజయ్ తేల్చిచెప్పారు. వికృత ఉన్మాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత కూడా కేసీఆర్ దే అని బండి సంజయ్ ఆరోపించారు. బిజెపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరబోతున్నారన్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్న బండి సంజయ్, కావాలని టిఆర్ఎస్ పార్టీ ఫాల్స్ ప్రాపగండా మొదలు పెట్టిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు ఆయన. మునుగోడు ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.

బీజేపీ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతుంది
బిజెపి సింగిల్ గానే పోటీ చేస్తుందని ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లబోదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుండి నుండి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలతో పదవులకు రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ము కేసీఆర్ కు ఉందా అంటూ బండి సంజయ్ నిలదీశారు. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పింది ఎవరు అని ప్రశ్నించిన బండి సంజయ్ 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయమే లేకుండా ప్రైవేటీకరణ ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. మునుగోడు ఓటమితో బీజేపీ కృంగి పోలేదని పేర్కొన్న బండి సంజయ్ మరింత ఉత్సాహంతో పాదయాత్ర 5 ను ప్రారంభించబోతున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. తమ పక్షాన ఎవరు పోరాడుతున్నారు అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications