కొండా సురేఖ దమ్ముంటే రాజీనామా చేసి తనపై పోటీ చెయ్యాలి: బస్వరాజు సారయ్య సవాల్!
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ తో ఆమె ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి పార్టీని వీడి వెళ్తారని అంతా భావించారు. కానీ కొండా సురేఖ ఊహించని విధంగా ఎమ్మెల్యేగా పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు. దీంతో రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్తారు అనుకున్న సురేఖ ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పటంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య భగ్గుమన్నారు.
కొండా సురేఖను టార్గెట్ చేసిన సారయ్య
తాజాగా కార్యకర్తలతో సమావేశమైన బస్వరాజు సారయ్య కొండా సురేఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు సవాల్ విసురుతూ "దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రజల మద్దతు ఎవరి వైపు ఉందో ఎన్నికల ద్వారా తేల్చుకుందామని సవాల్ విసిరారు.

బ్లాక్మెయిల్ కల్చర్ మీదే అంటూ సురేఖ పై ఫైర్
కొండా సురేఖపై విమర్శలు గుప్పిస్తూ బస్వరాజు సారయ్య "ఇన్ని సంవత్సరాలు ప్రజల రక్తం తాగిన మీరు ఇప్పుడు బీసీ కార్డును ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఇంకా ఎన్నాళ్లు బీసీ కార్డును వాడుకుంటారు?" అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే తాను ఊరుకోబోనని హెచ్చరించారు. కొండా సురేఖపై హైకమాండ్కు ఫిర్యాదు చేసింది తానేనని వెల్లడించారు. "బ్లాక్మెయిల్ కల్చర్ మీదే " అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
కొండా సురేఖ చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావన్న సారయ్య
గతంలో చోటుచేసుకున్న పలు ఘటనలను ప్రస్తావిస్తూ బస్వరాజు సారయ్య ప్రశ్నలు సంధించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో "250 మూగజీవాలను కాల్చింది ఎవరు? కాలిపోయిన స్థలం ఎవరి పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉంది?" అంటూ ఆమెను నిలదీశారు. నియోజకవర్గంలో కొండా సురేఖ చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావని మండిపడ్డారు. సీఎం ను నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.
దమ్ముంటే తనపై పోటీ చెయ్యాలని సారయ్య సవాల్
కాంగ్రెస్ పాలనను తప్పు పడుతూ అందులోనే ఎందుకు కొనసాగాలని, దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నారు. ఈ తాజా సవాల్తో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.కొండా సురేఖ ఇటీవల సోషల్ మీడియాలో "ఇక నిరీక్షణ ముగిసింది.. త్వరలో బిగ్ అప్డేట్" అంటూ పోస్ట్ చేశారు. దీనిపై ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బస్వరాజు సారయ్య సవాల్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సవాల్పై కొండా సురేఖ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ ప్రాంతంలో ఇద్దరి ప్రభావం ఉండటంతో ఈ మాటల యుద్ధం ఏరూపు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications