పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ నోటీసుల వెనుక.. బండి సంజయ్ కు భవిష్యవాణి తెలుసా?
బండి సంజయ్ అన్నట్టే జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఉందని, అందుకే పైలెట్ రోహిత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు డ్రామా కెసిఆర్ ఆడించారు అని బండి సంజయ్ పేర్కొన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బండి వ్యాఖ్యలకు తగ్గట్టు పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు.. ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే
ఈనెల 19వ తేదీన విచారణకు రావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ని విచారణ చేయనున్నారు. 2014 సంవత్సరం నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలు, కంపెనీలు వ్యవహారాలపై ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ని ప్రశ్నించనున్నారు.
అయితే ఈ నేపథ్యంలో తనకు నోటీసులు రావడంపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు అసలు ఏ కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారో కూడా తెలియదని ఆయన పేర్కొన్నారు.

బండి సంజయ్ కు తనకు నోటీసులు ఇచ్చే విషయం ఎలా తెలుసు
ఈడీ అధికారులు తన బయోడేటా అడగడం హాస్యాస్పదంగా ఉందని పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్ తన గురించి వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే, ఈడీ సమన్లు వచ్చాయి అని పేర్కొన్న పైలట్ రోహిత్ రెడ్డి బండి సంజయ్ కి భవిష్యవాణి తెలుసా అంటూ మండిపడ్డారు.
ఈడి తనకు నోటీసు ఇచ్చే విషయం బండి సంజయ్ కు ఎలా తెలుసు అంటూ ప్రశ్నించిన రోహిత్ రెడ్డి దేశంలో సి.బి.ఐ, ఈ.డీలు బండి సంజయ్ కింద పనిచేస్తున్నాయి అంటూ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రను తాను అడ్డుకున్నందుకే తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందని పైలట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ కు పైలట్ రోహిత్ రెడ్డి సవాల్
నాకు ఎలాంటి కేసులతో సంబంధం లేదని పేర్కొన్న పైలట్ రోహిత్ రెడ్డి తనకు ఈడి నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు పైలట్ రోహిత్ రెడ్డి. ఈడీ నోటీసులు ఇచ్చినా, సి బి ఐ ఎంక్వయిరీ లు చేసినా తగ్గేది లేదని, భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయపరంగా సమాధానం ఇస్తానని పైలట్ రోహిత్ రెడ్డి తేల్చి చెప్పారు.
ఇక తనపై రకరకాల ఆరోపణలు చేసిన బండి సంజయ్ కు సవాల్ విసిరిన పైలట్ రోహిత్ రెడ్డి యాదగిరిగుట్ట కు తాను తడిబట్టలతో రావడానికి, ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. బండి సంజయ్ ఎప్పుడు వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ఎటువంటి కేసులతో సంబంధం లేదని మరోమారు తేల్చి చెప్పారు పైలెట్ రోహిత్ రెడ్డి.












Click it and Unblock the Notifications