ముందే ఎలా?: సునీత పప్పులో కాలేసి దొరికిపోయారా?
హైదరాబాద్: అధికార పార్టీ ప్రజాప్రతినిధి గొంగిడి సునీత పప్పులో కాలేశారని అంటున్నారు. తప్పులో కాలేసి ఆమె అడ్డంగా దొరికి పోయారని వార్తలు వస్తున్నాయి. పాత నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే అయిన ఆమె నియోజకవర్గంలోని ఏడు మండలాలలో గుండాల ఒకటి. పునర్వ్యవస్థీకరణలో అందులోని ఓ గ్రామం మోటకొండూరు మండలంలోకి, రెండు ఆత్మకూరు (ఎం) మండలంలోకి వెళ్లాయి.
ఈ రెండూ యాదాద్రి జిల్లాలోకి వెళ్లాయి. మిగిలిన పదిహేడు గ్రామాలతో కూడిన గుండాల మండలాన్ని జనగామలో కలిపారు. తమను యాదాద్రి జిల్లాలోనే కలపాలని స్థానికులు ఆందోళన చేసినా జనగామలోనే కొనసాగించారు. దాంతో, తమ ఆందోళనలను, వినతులను ప్రభుత్వం పట్టించుకోలేదని, సునీత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

దాంతో, గుండాల మండలాన్ని జనగామ జిల్లా నుంచి తొలగించి యాదాద్రిలో కలపాలంటూ తాను ఎప్పుడో ప్రభుత్వానికి విన్నవించానని, ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ కూడా రాశానని ఆమె లేఖను ప్రజలకు చూపించారని, అయితే ఆ లేఖను సెప్టెంబరు పదో తేదీన తయారు చేసినట్లు తేదీ ఉంటే, దానిపై గొంగిడి సునీత సెప్టెంబరు 20వ తేదీన సంతకం చేసి, తేదీ కూడా స్వయంగా వేశారని ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది.
జిల్లాల విభజన తుది నోటిఫికేషన్ ఈ నెల 10న అర్ధరాత్రి దాటాక వెలువడిందని, ఆగస్టు 22న జారీ అయిన ముసాయిదాలో జనగామ పేరు లేదని గద్వాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు ఈ నెల రెండో తేదీన సంకేతాలు వచ్చాయని, మూడో తేదీన మీడియా ద్వారా బయటికి తెలిసిందని అంటున్నారని పేర్కొంది.
అప్పుడే కేకే నేతృత్వంలో హైపవర్ కమిటీ వేశారు. ఆ తర్వాత గుండాల మండలాన్ని జనగామలో చేర్చుతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రజలు వ్యతిరేకించారు. ధర్నాలు చేశారు. సెప్టెంబర్ సెప్టెంబరు 20వ తేదీకి అసలు జనగామ జిల్లా ప్రతిపాదనే లేదని, గ్రామాలను జనగామ జిల్లాలో కలుపుతారనే ప్రసక్తి కూడా ఉత్పన్నం కాలేదని పాయింట్ లాగుతున్నారు.












Click it and Unblock the Notifications