పాల్వాయి స్రవంతికి పెద్ద పరీక్షే; మునుగోడులో మద్దతుకోసం తిప్పలు; అసంతృప్తులు మద్దతిస్తారా?
మునుగోడులో త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్న కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని రంగంలోకి దించింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పేరును ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపాదించడంతో, పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అధినాయకత్వం. ఇక ఈ క్రమంలో మునుగోడులో విజయం సాధించడం కోసం పాల్వాయి స్రవంతి పని మొదలు పెట్టారు.

మునుగోడు ముఖ్యనేతలను కలుస్తున్న పాల్వాయి స్రవంతి
మునుగోడు నియోజకవర్గంలో తనకు పూర్తి సహకారం అందించాలని మునుగోడు ముఖ్య నేతలను కలిసి పాల్వాయి స్రవంతి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను కలిసిన పాల్వాయి స్రవంతి మునుగోడు నియోజకవర్గంలో ప్రజల మద్దతును కూడగట్టడానికి వారి సహకారం కావాలని కోరారు. రెండు రోజులుగా కీలక నేతలను కలుస్తున్న పాల్వాయి స్రవంతి, పార్టీ నేతల నుంచి ఎటువంటి వ్యతిరేకత లేకుండా, ప్రతి ఒక్కరు తనకు పూర్తిగా సహకరించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

నేతలను ఏకతాటి మీదకు తెచ్చేందుకు కాంగ్రెస్ యత్నాలు
పాల్వాయి స్రవంతి ఇటీవల రేవంత్ రెడ్డి తో సమావేశానికి ముందే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో, పార్టీలోని నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ముందుకు వెళ్లాలని పాల్వాయి స్రవంతి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మునుగోడు టికెట్ ఆశించిన బీసీ నేతల అసంతృప్తిని తొలగించడం కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ లతో సమావేశమై వారిని అనునయించే ప్రయత్నం చేశారు.

ప్రతీ ఒక్కరితో మాట్లాడుతూ మద్దతు కోరుతున్న పాల్వాయి స్రవంతి
అభ్యర్థి ఎంపికలో తీసుకున్న ప్రమాణాలను, పార్టీ పరిస్థితిని నేతలకు వివరించి సహకారం అందించాలని కోరారు. ఇక పాల్వాయి స్రవంతి కూడా ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ తనకు సహకరించేలా, పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిన నేపథ్యంలో, పార్టీ సర్వశక్తులను ఒడ్డి మునుగోడు ఉపఎన్నికలలో పోరాటం చేయనుంది. ఈ క్రమంలోనే పార్టీలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో కావలసి ఉన్న నేపథ్యంలో పాల్వాయి స్రవంతి ఆ పని చేసుకుపోతున్నారు.

మునుగోడులో పాల్వాయి స్రవంతి ప్రయత్నం సక్సెస్ అవుతుందా?
మరి పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం పాల్వాయి స్రవంతికి సాధ్యమవుతుందా? ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను చిత్తు చేసి కాంగ్రెస్ మళ్ళీ మునుగోడులో విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉందా? పాల్వాయి స్రవంతికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తిస్థాయిలో సహకరించే అవకాశం ఉందా? ఇక సొంత పార్టీ లోని అసంతృప్తులు మద్దతు ఇస్తారా అన్నది ప్రస్తుతం మునుగోడు కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.












Click it and Unblock the Notifications