అత్యంత ప్రతిష్టాత్మకంగా అమిత్ షా సభ: రాహుల్ గాంధీ సభను మించి జనసమీకరణ; వ్యూహమిదే!!
తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇక బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సభ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న దానికి సంకేతంగా మారింది. ఇక ఈ నెల 14వ తేదీన మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ సమీపంలో నిర్వహించే కేంద్ర మంత్రి అమిత్ షా సభ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అమిత్ షా సభను భారీగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్
రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను బిజెపి రాష్ట్ర నాయకత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న ముగింపు సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో ఈ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున జనాన్ని సమీకరించి లక్షలాది మందితో సభను నిర్వహించాలని బిజెపి ప్లాన్ చేస్తుంది.
రాహుల్ సభ కంటే ధీటుగా.. అమిత్ షా సభ, నిర్వహణ కోసం మంతనాలు
ప్రతి పోలింగ్ బూత్ నుండి కనీసం 20 మందిని తరలించాలని, నియోజకవర్గానికి ఐదు వేలు తక్కువ కాకుండా ప్రజలను, కార్యకర్తలను తరలించాలి అని బిజెపి ప్లాన్ చేస్తుంది. రాహుల్ గాంధీ సభ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా జనసమీకరణ చేయాలని బిజెపి భావిస్తోంది. ఈ సభ ద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా వరుసగా పార్టీ ముఖ్య నాయకులతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంతనాలు జరుపుతున్నారు.
జిల్లాల వారీగా జనసమీకరణకు వ్యూహం.. అమిత్ షా సభ ప్రతిష్టాత్మకం
జిల్లాల వారీగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పాదయాత్ర ముగింపు సభ సక్సెస్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాను కూడా విరివిగా ఉపయోగించాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. అంతే కాదు టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలని సూచిస్తున్నారు. పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా వస్తున్నారన్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేసి, అమిత్ షా సభకు జనసమీకరణ చెయ్యాలని, దీనిని ప్రతి ఒక్కరూ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బండి సంజయ్ సూచిస్తున్నారు.
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే.. అందుకే పాదయాత్ర ముగింపు సభకు ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని నిలువరించడానికి కాంగ్రెస్ పార్టీ కూడా అగ్రశ్రేణి నాయకులను రంగంలోకి దిగుతున్న క్రమంలో, బిజెపి నాయకులు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అని చూపించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కనీవినీ ఎరుగని రీతిలో పాదయాత్ర ముగింపు సభకు జనాన్ని తరలించి బిజెపి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టు అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి.