బీజేపీ కొత్త టీమ్స్... తెలుగు రాష్ట్రాలకు కమలం కొత్త ఇన్చార్జిలు వీరే..
దేశంలోని వివిధ రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్చార్జిగా కేంద్రమంత్రి మురళీధరన్ను నియమించిన బీజేపీ... ప్రస్తుత ఇన్చార్జి సునీల్ దియోధర్ను సహ ఇన్చార్జి పదవికి పరిమితం చేసింది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిగా బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతో పాటు జమ్మూకశ్మీర్,లేహ్ బీజేపీ ఇన్చార్జి బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించింది. ఇంతకుముందు,ఆయన ఢిల్లీ సహ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయా రాష్ట్రాల ఇన్చార్జిల జాబితాను విడుదల చేశారు.
ప్రస్తుతం కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావును ఆ బాధ్యతల నుంచి తప్పించి మధ్యప్రదేశ్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక కొత్త ఇన్చార్జిగా అరుణ్ సింగ్,సహ ఇన్చార్జిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణను నియమించింది. ఒడిశా కొత్త ఇన్చార్జిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరిని,సహ ఇన్చార్జిగా విజయ్పాల్ తోమర్ను నియమించింది. ఛత్తీస్గఢ్ బీజేపీ ఇన్చార్జి బాధ్యతలను కూడా పురంధేశ్వరికే అప్పగించింది.తమిళనాడు సహ ఇన్చార్జ్గా పొంగులేటి సుధాకర్రెడ్డికి బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.
Recommended Video
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇన్చార్జిగా కైలాష్ విజయ్వర్గియాను కొనసాగించింది. ఆ రాష్ట్ర బీజేపీ సహ ఇన్చార్జిలుగా పార్టీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్,పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాళవియాలను నియమించింది. బిహార్,గుజరాత్ రాష్ట్రాల బీజేపీ ఇన్చార్జిగా భూపేంద్ర యాదవ్ను ఆ పార్టీ కొనసాగించింది. జాతీయ కార్యదర్శులు హరీశ్ ద్వివేది,అనుపమ్ హజారాలను ఈ రెండు రాష్ట్రాల్లో సహ ఇన్చార్జిలుగా నియమించింది.
బీజేపీ ఉపాధ్యక్షుడు వైజయంత్ పాండాను ఢిల్లీ,అసోం రాష్ట్రాల ఇన్చార్జిగా నియమించింది. పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవిని మహారాష్ట్ర,గోవా,తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా నియమించింది. మరో జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ను పంజాబ్,చంఢీగఢ్,ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఇన్చార్జిగా నియమించింది. జార్ఖండ్,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఇన్చార్జిగా దిలీప్ సకియాను నియమించింది. ఇక కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ను ఇన్చార్జిగా నియమించింది. ఆయనతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్కు కూడా యూపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది.