'టి'లో టిడిపికి భవిష్యత్ లేదా?: బిజెపి ఒంటరి పోరు వెనుక..
తెలంగాణలో టిడిపితో పొత్తు ఉండదని బిజెపి ప్రకటించింది.తాము కూడ బిజెపితో కలిసే ప్రసక్తే లేదని టిడిపి కూడ తేల్చి చెప్పింది.ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఒంటరిగానే పోటీచేస్తోంది. బిజెపితో తాము కలిసే ప్రసక్తే లేదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్వాగతించారు.
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బిజెపి, టిడిపిల మధ్య పొత్తు కుదిరింది. అయితే తెలంగాణలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తును బిజెపి నేతలు కోరుకోవడం లేదు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. అయితే తాము కూడ బిజెపితో కలిసి వెళ్ళాలనే ఆలోచన కూడ టిడిపి తెలంగాణ నేతలకు లేదు. అయితే తెలంగాణలో టిడిపి బలహీనంగా ఉందని బిజెపి నేతల భావన. అంతేకాదు టిడిపితో పొత్తు కుదుర్చుకొంటే వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోతామనే భావన బిజెపి నేతల్లో ఉంది.
ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని బిజెపి నేతలు టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. ఒంటరిగానే పోటీచేయాలని నిర్ణయం తీసుకొన్నారు. మూడు మాసాల క్రితం తెలంగాణలో పర్యటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణలో ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించారు.

2014లో అయిష్టంగానే టిడిపితో పొత్తు
2014 ఎన్నికల్లో టిడిపితో బిజెపి అయిష్టంగానే ఎన్నికల పొత్తుకు సిద్దపడింది. ఆ సమయంలో బిజెపి నాయకులు టిడిపిని కాకుండా టిఆర్ఎస్తో పొత్తును కోరుకొన్నారు. టిఆర్ఎస్కు చెందిన కీలక నాయకులు కూడ బిజెపితో పొత్తు పెట్టుకోవాలని భావించారు. కానీ, టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ మాత్రం బిజెపితో పొత్తును ఇష్టపడలేదు. ఒంటరిగానే పోటీచేయాలని భావించారు. ఈ మేరకు కెసిఆర్ ఒంటరిగానే పోటీచేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో టిడిపి, బిజెపి అభ్యర్థులు టిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తును కుదుర్చుకొన్నాయి. కానీ, ఆశించిన ఫలితాలు మాత్రం ఈ రెండు పార్టీలకు రాలేదు.

తెలంగాణలో టిడిపికి భవిష్యత్ లేదా?
తెలంగాణలో టిడిపి బలహీనపడిందనేది బిజెపి నాయకుల భావనగా కన్పిస్తోంది. తెలంగాణ ఉద్యమ సంయంలో టిడిపిని లక్ష్యంగా చేసుకొని టిఆర్ఎస్ చేసిన ప్రచారం టిడిపిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది.టిడిపి నుండి కీలక నాయకులు టిఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల్లో టిడిపి నుండి 15 మంది ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా టిఆర్ఎస్లో చేరారు. క్షేత్రస్థాయిలో టిడిపి క్యాడర్ కూడ చెల్లాచెదురైందనే భావన కమలనాథుల్లో ఉంది. ఈ కారణంగానే టిడిపితో పొత్తును బిజెపి నేతలు వద్దనుకొంటున్నారు.

ప్రత్యామ్నాయంగా బలపడేందుకు బిజెపి ప్లాన్
తెలంగాణలో కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపిలకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా అవతరించాలని బిజెపి ప్లాన్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు జాతీయ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకనేతలను బిజెపిలో చేర్చుకోనేందుకు ఆపరేషన్ ఆకర్ష్ను బిజెపి ఎంచుకొంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలతో బిజెపి జాతీయ నాయకులు చర్చలు జరిపారని కమలనాథులు అంటున్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావాలనే ప్లాన్తో బిజెపి ఉంది. ఈ మేరకు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలకు బిజెపి బంపర్ ఆఫర్లు ఇస్తామని ప్రకటిస్తోందనే సమాచారం.

టిఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో కూటమికి టిడిపి ప్రయత్నం
తెలంగాణలో టిఆర్ఎస్ వ్యతిరేక పార్టీలను కూడగట్టేందుకు సిపిఎం ప్రయత్నాలను ప్రారంభించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ విషయమై పలు పార్టీలతో చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే టిఆర్ఎస్కు వ్యతిరేకంగా పార్టీల కూటమిలో టిడిపి కూడ క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్టు ప్రకటించింది. అయితే విపక్లా మధ్య ఓట్ల చీలికను నివారించేందుకుగాను ప్రయత్నాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్, టిడిపిల మధ్య పొత్తుకు అనుకూలంగా కూడ సంకేతాలు వెలువడ్డాయి.ఈ తరుణంలో బిజెపితో పొత్తును తాము కోరుకోవడం లేదని రేవంత్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications