సాగర్ ఉపఎన్నిక వేళ... బీజేపీకి బిగ్ షాక్... టీఆర్ఎస్లో చేరనున్న నివేదితా రెడ్డి
సాగర్ ఉపఎన్నిక వేళ తెలంగాణ బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ కీలక నేతలు నివేదితా రెడ్డి,కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఈ ఇద్దరు నేతలతో మంత్రి జగదీష్ రెడ్డి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి... ఆయన సమక్షంలోనే పార్టీ కండువా కప్పనున్నట్లు సమాచారం.

టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు...
సాగర్ ఉపఎన్నిక టికెట్పై నివేదితా రెడ్డి,కడారి అంజయ్య యాదవ్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తనకు మరోసారి అవకాశం దక్కుతుందని నివేదితా రెడ్డి భావించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ టికెట్ ప్రకటించకపోయినా నామినేషన్ కూడా దాఖలు చేశారు. అదే సమయంలో యాదవ సామాజికవర్గానికి చెందిన కడారి అంజయ్య కూడా తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. సాగర్లో యాదవ సామాజికవర్గం బలంగా ఉండటంతో టికెట్ తనకే దక్కుతుందని భావించారు. కానీ బీజేపీ రాష్ట్ర అధిష్టానం రవి నాయక్కి టికెట్ ఇవ్వడంతో ఈ ఇద్దరు పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఇన్చార్జిలను కూడా లాగుతున్నారు...
బీజేపీపై అసంతృప్తితో ఉన్న నివేదితా రెడ్డి,కడారి అంజయ్య యాదవ్లతో మంత్రి జగదీష్ రెడ్డి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంతో... ఈ ఇద్దరూ టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఈ ఇద్దరినీ కేసీఆర్ ఫామ్ హౌస్కి తీసుకెళ్లి ఆయన సమక్షంలోనే గులాబీ కండువా కప్పబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు,సాగర్లో బీజేపీ నియమించిన పలువురు ఇన్చార్జి నేతలు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా,ప్రస్తుతం నివేదితా రెడ్డి భర్త శ్రీధర్ రెడ్డి నల్గొండ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు.సతీమణి నివేదితా టీఆర్ఎస్లో చేరుతుండటంతో ఆయన కూడా బీజేపీని వీడుతారా అన్న చర్చ జరుగుతోంది.

వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేసీఆర్....
సాగర్ ఉపఎన్నిక వేళ ఇద్దరు కీలక నేతలు బీజేపీని వీడటం ఆ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చివరి నిమిషం వరకూ అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ క్రియేట్ చేసి బీజేపీ గాలానికి టీఆర్ఎస్ అసంతృప్త నేతలు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. అదే సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డికి,తేరా చిన్నపరెడ్డికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని బుజ్జగించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు చూడకుండా కట్టుదిట్టమైన వ్యూహం రచించినట్లయింది.

ఏప్రిల్ 17న సాగర్ ఉపఎన్నిక...
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో సాగర్ ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 17న ఎన్నిక జరగనుండా మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. టీఆర్ఎస్ తరుపున నోముల భగత్,కాంగ్రెస్ తరుపున జానారెడ్డి,బీజేపీ తరుపున రవి నాయక్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ జానారెడ్డిని బరిలో దించడంతో అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ ఆచి తూచీ వ్యవహరించింది. మన్నె రంజిత్ యాదవ్,శ్రీనివాస్ యాదవ్,తేరా చిన్నపరెడ్డి తదితరుల పేర్లను పరిశీలించిన టీఆర్ఎస్ అధిష్టానం చివరకు నోముల భగత్కే టికెట్ ఇచ్చింది. భగత్కు స్వయంగా బీఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం రూ.28లక్షలు చెక్కును కూడా అందేజేశారు.












Click it and Unblock the Notifications