హుజూర్ నగర్ లో బీజేపీ సభ్యులు కూడా ఓటెయ్యలేదా ? షాక్ లో బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక బీజేపీ కి షాక్ ఇచ్చింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలని ప్రయత్నాలు సాగిస్తున్న బిజెపికి హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో గట్టి దెబ్బే తగిలింది. అది అలాంటి ఇలాంటి దెబ్బ కాదు. డిపాజిట్ కోల్పోయింది బీజేపీ. అంతేనా అన్నిటి కంటే షాకింగ్ అనిపించే అంశం ఇప్పుడు బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
తెలంగాణలో ఇటీవల కాలంలో టిఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిన బీజేపీకి చుక్కలు చూపించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
హుజూర్ నగర్ లో బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థి కంటే వెనుకపడటం, దారుణ ఓటమిపాలు కావటం ఆ పార్టీకి ఘోర అవమానంగా మారిందని చెప్పొచ్చు.ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలకు వచ్చిన ఫలితానికి అస్సలు పొంతనే లేకుండా పోయింది. హుజూర్నగర్లో కమలానికి పోలైన ఓట్లు ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి కంటే తక్కువ అంటే పార్టీ పరిస్థితి అర్ధం అవుతుంది.

అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే బీజేపీ సభ్యత్వం తీసుకున్న ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటు వెయ్యలేదు అన్నది తాజా బీజేపీ నేతల రిజల్ట్ పోస్ట్ మార్టంలో చర్చకు వచ్చింది. గెలిచే ఛాన్స్ లేకున్నా ఓటు బ్యాంకు పుంజుకుంటుంది అని భావించింది బీజేపీ .కానీ అలాంటి పరిస్థితి కూడా లేదు. బీజేపీ సభ్యత్వం తీసుకున్న వారంతా కూడా బీజేపీకి ఓటు వెయ్యకపోవటం బీజేపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్న వాళ్లు 3600 మంది ఉన్నారు. ఇక బీజేపీకి పోలైన ఓట్లు మాత్రం 2621 మాత్రమే. మిగతా ఓటర్లు ఎవరికి ఓటు వేశారు అన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.
హుజూర్ నగర్ అభ్యర్థి ఎంపిక విషయంలోనే ఆచి తూచి నిర్ణయం తీసుకున్నామని భావించారు. ఇక అదేపనిగా ప్రచారం చేశారు. ఇక బీజేపీ నేతల తీరు చూసి ఆ పార్టీకి గౌరవప్రదమైన ఓట్లు వస్తాయని పలువురు భావించారు. కానీ ఫలితం మాత్రం పూర్తి నిరాశాజనకంగా వచ్చింది. అసలు బీజేపీ సభ్యులే బీజేపీ అభ్యర్థిని ఆదరించకపోవటం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా బీజేపీ అతి విశ్వాసంతో ముందుకు వెళితే దెబ్బ తింటుంది అని గుర్తించాల్సిన అవసరం ఉందని హుజూర్ నగర్ ఉప ఎన్నికలు స్పష్టంగా చెప్తున్నాయి.












Click it and Unblock the Notifications